-గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు మొర
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్కు గ్రామస్తులు తమ సమస్యలను వినిపించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్లు లేకపోవడంతో గ్రామానికి వచ్చే ప్రభుత్వ సిబ్బంది, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
అలాగే గ్రామానికి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని, ఓ వార్డులో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపైకి వస్తోందని తెలిపారు. ఎల్లమ్మ ఆలయం వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అవుతుండటంతో తక్షణమే మరమ్మతులు చేయాలని, మైనారిటీలకు ఫంక్షన్ హాల్ నిర్మించాలని గ్రామ మహిళలు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీని వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు బస్సు సర్వీస్ పునరుద్ధరణ కోసం రవాణా శాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.



