ఉమర్ ఖాలీద్, షార్జిల్ ఇమామ్ సహా పది మందికి
బెయిల్ తిరస్కృతిపై సీపీఐ(ఎం) విచారం
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్లతో సహా పది మందికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంపై సీపీఐ(ఎం) తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల వెనుక కుట్రలో పాత్ర వుందంటూ నిరంకుశ ఉపా చట్టం కింద వీరందరినీ ఐదేండ్లుగా నిర్బంధంలో వుంచారు. గత ఐదేళ్ళలో వారి బెయిల్ దరఖాస్తులను తిరస్కరించడం ఇది ఐదవసారి. గత ఐదేండ్ల కాలంలో వారిపై కనీసం అభియోగాలు కూడా మోపకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశమని పొలిట్బ్యూరో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయాన్ని అపహాస్యం చేసేలా వుందని పేర్కొంది. ”బెయిల్ మంజూరు చేయడం నిబంధన, తిరస్కరించడం మినహాయింపు” అన్న సూత్రాన్ని కూడా ఇది తిరస్కరిస్తోందని పొలిట్బ్యూరో ప్రకటన పేర్కొంది. నేరం చేశారని నిరూపిత మవకుండా కనీసం అందుకు రుజువులు కూడా లేకుండానే ఐదేండ్లకు పైగా ఈ పది మంది యువకులు ఒకపక్క జైలులో మగ్గుతుంటే, కపిల్ మిశ్రా, అనురాగ్ థాకూర్ వంటి బీజేపీ నేతలు మాత్రం అదే ఢిల్లీ మత ఘర్షణలకు ఆజ్యం పోసేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి బయట స్వేచ్ఛగా తిరుగుతున్న విషయాన్ని ఇక్కడ గమనించాలని కోరింది. మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితులు ప్రజ్ఞా సింగ్ థాకూర్, కల్నల్ ప్రసాద్ పురోహిత్ తదితరులను నిర్దోషులుగా విడిచిపెడితే, ఉమర్ ఖాలీద్, షార్జిల్ ఇమామ్ ప్రభృతులను ఐదేండ్లకు పైగా జైళ్ళలో మగ్గేలా చేయడం తీవ్రమైన న్యాయ విరుద్ధమని పొలిట్బ్యూరో విమర్శించింది.
న్యాయాన్ని అపహాస్యం చేయడమే
- Advertisement -
- Advertisement -