– నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలిలో ఘటన
– గ్రామాన్ని సందర్శించిన కేవీపీఎస్ నాయకులు
నవతెలంగాణ-పోతంగల్
దుర్గామాత వద్దకు పూజ చేసుకుందామని వచ్చిన దళితులను అవమానపరచడం అమానుష మని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్వాల నర్సయ్య, కొండ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో సెప్టెంబర్ 28న గ్రామానికి చెందిన దళితులు దుర్గామాత దర్శనానికి వెళ్తే.. దుర్గమాత మండప కమిటీ సభ్యులు ‘దళితులు దుర్గమాత వద్దకు రాకూడదు’ అంటూ అవమానించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కేవీపీఎస్ జిల్లా నాయకుల బృందం మంగళవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. దళితులతో సమావేశమై ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. అన్నీ పండుగల్లో తమను వేర్వేరుగా చూస్తారని దళిత మహిళలు నాయకుల ముందు వాపోయారు. తమకు జరిగిన అవమానా నికి ఊర్లో తిరగలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వినాయక చవితి పండుగలో సైతం అన్నదానంలో వేర్వేరుగా భోజనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దళితుల వద్ద చందా పోగు చేస్తున్నా.. దుర్గమాత విగ్రహం వద్దకు రానీయడం లేదని వాపోయారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ.. దళితులను అవమానపరిచిన దుర్గామాత కమిటీ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం దళిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్శనలో కేవీపీఎస్ ఏరియా కన్వీనర్ ఇందూర్ సాయిలు, దళితులు అర్జున్, శంకర్, సచిన్, బసవ్వ, గంగవ్వ, నితీన్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గామాత వద్దకు రానీయకపోవడం అమానుషం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES