సూర్యాపేట జిల్లాకు, ఎస్సారెస్పీ-2కు బిఎన్ రెడ్డి పేరు పెట్టాలి
ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో వక్తల డిమాండ్
నవతెలంగాణ – ముషీరాబాద్
తెలంగాణ ప్రజల విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన ప్రజాయోధుల త్యాగాలను, ఆదర్శాలను విస్మరిస్తే ఎంతటి నాయకులకైనా, ప్రభుత్వాలకౖౖెనా పతనం తప్పదని వక్తలు హెచ్చరించారు. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్), అఖిలభారత వ్యవసాయ కార్మిక సమాఖ్య (ఏఐఏడబ్ల్య్లూఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షతన బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి మాట్లాడారు.
వీర తెలంగాణ రైతాంగ ఉద్యమ యోధులను, చరిత్రను కాలరాసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండో దశ కాలువకు ఏమాత్రం సంబంధం లేని మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్రెడ్డి పేరును ప్రకటించడమేనని అన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అని, అలాంటి వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగునీటి కోసం చట్టసభలలో, బయటా పోరాటాలు నిర్వహించి శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా 4:30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేసిన బిఎన్ రెడ్డి పేరునే పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, సూర్యాపేట జిల్లాను బిఎన్.రెడ్డి జిల్లాగా మార్చాలని, ట్యాంక్ బండ్పై కాంస్య విగ్రహం, ఐదు ఎకరాలు కేటాయించి స్మృతి వనం ఏర్పాటు చేసి పాఠ్యాంశాలలో చేర్చాలని కోరారు. శ్రీరామ్సాగర్ రెండో దశ కాలువకు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన పేరును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు నాగార్జున రెడ్డి, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెద్దారపు రమేష్, హైకోర్టు న్యాయవాది నరసింహారావు, బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మెన్ నల్ల సూర్యప్రకాష్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న, గోనె కుమారస్వామి, జక్కుల వెంకటయ్య, వనం సుధాకర్, వంగల రాగసుధ, ఎన్ రెడ్డి హంసారెడ్డి, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత, బిఎన్ రెడ్డి కుమారుడు భీమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మేనల్లుడు మల్లు కపోతంరెడ్డి, మేనకోడలు పాతూరి కరుణ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యోధుల చరిత్రను విస్మరించడం తగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



