నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రజాకవి అందెశ్రీ ని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సామాచార, పౌర సంబంధాల శాఖ పూర్వ స్పెషల్ కమిషనర్ ఫణికుమార్ తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విశ్రాంత ఉద్యోగుల వార్షిక ఆత్మీయ సమ్మేళనం ఆదివారంనాడిక్కడి ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశమందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనతోపాటు రిటైర్డ్ డైరెక్టర్లు కిస్మత్కుమార్, సుభాష్గౌడ్, సత్యారావు, శ్రీనివాస్, ప్రమోద్రావు సహా విశ్రాంత అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫణికుమార్ మాట్లాడుతూ 2001లో జరిగిన మహిళా జన్మభూమి కార్యక్రమానికి తమ శాఖాపరమైన ఆహ్వానంపై అందెశ్రీ ఎన్నో ఉత్తేజకరమైన పాటలు రాసారనీ, ఆ పాటల్లో తెలంగాణకు వ్యతిరేకంగా, కించపరుస్తూ రాయబోనని అప్పట్లోనే స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఆ పాటలతోనే అందెశ్రీని సమాచారశాఖ ప్రపంచానికి పరిచయం చేసిందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార, పౌర సంబందాల శాఖ ఎంతో విశిష్టమైనదని, ఎంతటి క్లిష్టమైన ఈవెంట్లనైనా అతితక్కువ వ్యయంతో కష్టపడి, స్వచ్ఛందంగా పనిచేసి విజయవంతం చేసే అధికారులు, సిబ్బంది ఉన్నారని ప్రసంసించారు. ఇతర ఏశాఖలో ఉత్పన్నం వచ్చినా అది మనదే అని ఫీల్ అవడం సమాచార శాఖకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలతో నేరుగా ప్రత్యక్షంగా పనిచేసే శాఖ కూడా ఇదేనని చెప్పారు. ఇంటలిజెన్స్తో సమానంగా సమాచార శాఖ పనిచేస్తుందన్నారు. అయితే పీఆర్ఓ విధుల నిర్వర్తించడం ఆషామాషీ శాఖ కాదనీ, ఎంత చేసినా అద్భుతంగా చేశారని ఎవరూ మెచ్చుకోరని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో 75 ఏండ్లు పూర్తి చేసుకున్న రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. లీగల్ అంశాలపై ప్రసంగం, యోగా, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక క్లాసులు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



