– డిఫెండింగ్ ఛాంపియన్కు గాయాల బెడద
– తొలిదశ మ్యాచ్లకు హేజిల్వుడ్, కమిన్స్ దూరం
– 28నుంచి ఐపిఎల్ సీజన్-19 ప్రారంభం
బెంగళూరు: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఈసారి టైటిల్ కొట్టడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ బౌలర్లు పాట్ కమిన్స్తోపాటు జోష్ హేజిల్వుడ్ గాయాలబారిన పడడమే. గత సీజన్లో సారథ్య బాధ్యతలను విరాట్ కోహ్లీ నుంచి రజత్ పాటిదర్ అందుకొని 17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి టైటిల్ను అందించాడు. 2009, 2011, 2016లలో ఆ జట్టు ఫైనల్కు చేరినా.. టైటిల్ కొట్టలేదు. ఐపిఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్సీబీ జట్టు ఒకటి. సీనియర్ ఆటగాళ్ల సమన్వయంతో జట్టును సమర్థవంతంగా నడిపించిన పాటిదర్, ట్రోఫీ సాధన కలను సాకారం చేశాడు. గత సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర పోషించారు. అందరూ అద్భుతంగా ఆటడంతో 17ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గడచిన 18 సీజన్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాలుగుసార్లు ఫైనల్కు చేరడం. ఇందులో మూడుసార్లు రన్నర్గా నిలిచినా.. 2025 సీజన్లో ఛాంపియన్ నిలిచి ట్రోఫీని తొలిసారి ముద్దాడింది. ఈ సీజన్కు కూడా ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిధర్ పగ్గాలు అందుకున్నాడు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు తీసుకుని వ్యూహాత్మకంగా జట్టును ముందుకు నడిపించాలనే తపనతో ఉన్నాడు.
రికార్డుల రారాజు కోహ్లి..
ఐపిఎల్ ప్రారంభం నుంచి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రమే. సుధీర్ఘ కాలం ఒక ఫ్రాంచైజీలో కొనసాగడం రన్ మెషీన్ విరాట్ కోహ్లీకే సాధ్యమైంది. గత 18 సీజన్లలో 267 మ్యాచులను ఆడిన విరాట్ కోహ్లీ 8,661 పరుగుల రికార్డు సొంతం చేసుకున్నాడు. అలాగే అన్ని సీజన్లలో కలిపి విరాట్ కోహ్లీ 771 బౌండరీలు, 291 సిక్సర్లు కొట్టాడు. అలాగే 8 సెంచరీలు, 63 అర్ధ శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి సీజన్లోనూ విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహం నెలకొల్పుతున్నాడు. ఈ సీజన్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే.. ఆర్సీబీకి ట్రోఫీ దక్కడం ఖాయం. ఆటలోకి అడుగుపెట్టినప్పటినుంచి స్కోరు బోర్టును పరుగులు పెట్టించే ఆటగాళ్లు ఆర్సీబీ జట్టులో ఉండడమే ఇందుకు నిదర్శనం. రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ రాణిస్తే.. బౌండరీలు, సిక్సర్ల మోత మోగడం ఖాయం. బ్యాట్స్మెన్ చెలరేగితే ఆర్సీబీ రికార్డు స్థాయి స్కోరు నమోదు చేస్తుంది. టిమ్ డేవిడ్, రొమిరో షెఫర్డ్, జాకబ్ బేతేల్ భీకర ఫామ్లో ఉన్నారు. వెంకటేశ్ అయ్యర్, స్వప్నిల్ సింగ్ ఇటు బౌలింగ్, ఆటు బ్యాటింగ్లోనూ రాణించగల సత్తా ఉన్నవారే. ఐపిఎల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న బౌలర్గా భువనేశ్వర్ కుమార్కు పేరుంది. అత్యుత్తమంగా బౌలింగ్ వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్కు తోడు జోష్ హేజిల్ వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ, నువాన్ తుషారా, రసిర్ సలామ్, అభినందన్ సింగ్ బౌలింగ్ దళం దుర్భేద్యఫామ్లో ఉంది.
హేజిల్వుడ్ దూరం..
ఆర్సీబీ ఆడే తొలి దశ లీగ్ మ్యాచ్లకు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని హేజిల్వుడ్ టి20 ప్రపంచకప్లోనూ ఆసీస్ జట్టు తరఫున ఆడలేకపోయాడు. యాషెస్ సిరీస్లో ఆడుతూ గాయపడ్డ హేజిల్వుడ్ కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని, దీంతో ఐపిఎల్ తొలిసీజన్ మ్యాచ్లకు అతడు దూరమైనట్లు ఆ ఫ్రాంచైజీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బెంగళూరు తొలి దశ మ్యాచ్ల షెడ్యూల్…
28(శని) : బెంగళూరు × సన్రైజర్స్
(చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
ఏప్రిల్ 5(ఆది) : బెంగళూరు × చెన్నై
(చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
10(శుక్ర) : బెంగళూరు × రాజస్తాన్
(బర్సపరా స్టేడియం, గౌహతి)
12(ఆది) : బెంగళూరు × ముంబయి
(వాంఖడే స్టేడియం, ముంబయి)



