మనం ఇంట్లో ఎక్కువగా చేసే టిఫిన్లలో ఇడ్లీ, దోశ ముందు వరుసలో ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటారు. తొందరగా జీర్ణం అవుతాయి కాబట్టి వారంలో రెండు, మూడుసార్లు ఈ టిఫిన్లనే చాలామంది చేస్తుంటారు. అయితే ఈ పిండి తొందరగా పులిసిపోతుంటుంది. మరి ఎక్కువ రోజులు ఈ పిండిని ఫ్రెష్ గా ఎలా ఉంచుకోవాలో ఇక్కడ చూద్దాం…
– బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టకుండా 3 నుంచి 4 గంటలు మాత్రమే నానబెట్టండి. ఎక్కువసేపు నానబెడితే పిండి త్వరగా పులిసిపోతుంది.
– మినప్పప్పు త్వరగా నానిపోతుంది కాబట్టి ఒక గంట మాత్రమే నానబెడితే సరిపోతుంది.
– పిండిని రుబ్బుకునే ముందు గ్రైండర్ను శుభ్రంగా కడగాలి. లేకపోతే ముందు రుబ్బిన పిండి పులుపు గ్రైండర్లో ఉండిపోతుంది.
పప్పు రుబ్బుతున్నప్పుడు…
– పిండిని ఎక్కువసేపు రుబ్బకూడదు. చాలామంది పిండి రుబ్బుతున్నప్పుడు వంటింట్లో ఇతర పనులు చేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు రుబ్బితే గ్రైండర్ వేడెక్కుతుంది. ఆ వేడి వల్ల పిండి త్వరగా పులిసిపోతుంది.
– మినప్పప్పును రుబ్బుతున్నప్పుడు తరచుగా నీళ్లు చిలకరిస్తే 20-25 నిమిషాల్లోనే పొంగుతుంది. అలాగే బియ్యాన్ని కూడా సరైన సమయంలో రుబ్బుకోవాలి.
– కొందరు బియ్యం, మినప్పప్పును కలిపి రుబ్బుతారు. కానీ పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే బియ్యం, మినప్పప్పును విడివిడిగా రుబ్బుకోవాలి.



