మెయిన్ డ్రాకు ఆర్యన్, రాఘవ్ అర్హత
నేడు మెయిన్ రౌండ్ పోటీలు ప్రారంభించనున్న క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (టీఎస్టీఏ), జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేహెచ్ఐసీ) ఆధ్వర్యంలో టీఎఫ్ మెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ ఎం15 హైదరాబాద్ టోర్నీ మంగళవారం మొయిన్ డ్రా పోటీలతో ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ క్లబ్ ఆతిథ్యం ఇస్తున్న ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి లాంఛనంగా ప్రారంభిస్తారు. 15,000 అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 12 లక్షలు) ప్రైజ్ మనీ కలిగిన ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ఆర్యన్ లక్ష్మణన్, రాఘవ్ జైసింఘాని తదితరులు మెయిన్డ్రాకు అర్హత సాధించారు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఆర్యన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో సీడ్ అలెక్సీ అలెషెవ్తో జరిగిన పోరులో రెండో సెట్లో 35తో వెనుకబడినప్పటికీ, ఒత్తిడిని జయించి అనూహ్యంగా పుంజుకున్నాడు.
చివరికి ఆర్యన్ 76(2), 75 తేడాతో విజయం సాధించి మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నాడు. నాలుగో సీడ్ రాఘవ్ 36, 76(5),105తో భారత్కే చెందిన- అనికేత్ వెంకటరామన్ ను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో సార్థక్ 63, 64తో పార్థ్ అగర్వాల్ పై, ఆదిత్య బల్సేకర్ 75, 76(1)తో కాహీర్ వారిక్ పై, అర్జున్ రాఠీ 63, 62తో రిషి రెడ్డిపై, ఉదిత్ కాంబోజ్ 46, 61, 106తో గంటా సాయి కార్తీక్ రెడ్డిపై విజయం సాధించి మెయిన్డ్రా చేరుకున్నారు. గత టోర్నీ విజేత, టాప్ సీడ్ కరణ్ సింగ్ బెంగళూరులో జరగనున్న డేవిస్ కప్ సన్నాహకాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. అయితే, భారత డేవిస్ కప్ ఆటగాడు ఎస్. ముకుంద్ రెండో సీడ్గా బరిలోకి దిగడం భారత జట్టు అవకాశాలను మెరుగుపరిచింది. ఎస్డి ప్రజ్వల్ దేవ్ మూడో సీడ్గా ఉన్నాడు. ఉక్రెయిన్కు చెందిన ఎరిక్ వాన్షెల్బోయిమ్ టాప్ సీడ్గా బరిలోకి దిగి నేషనల్ చాంపియన్ మనీష్ సురేష్కుమార్తో తొలి రౌండ్లో తలపడనున్నాడు.



