Monday, January 5, 2026
E-PAPER
Homeఆటలుఅయ్యర్‌ వచ్చేశాడు

అయ్యర్‌ వచ్చేశాడు

- Advertisement -

శుభ్‌మన్‌ గిల్‌ సైతం జట్టులోకి..
కివీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

నవతెలంగాణ-ముంబయి
ప్లీహం గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్‌ అయ్యర్‌, మెడ నొప్పి నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్‌ మళ్లీ భారత వన్డే జట్టులోకి వచ్చారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ శనివారం భారత వన్డే జట్టును ఎంపిక చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌తో పాటు హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సైతం వన్డే జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతి లభించగా..దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడిన తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, ధ్రువ్‌ జురెల్‌కు కివీస్‌ సిరీస్‌కు జట్టులో చోటు దక్కలేదు. భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ జనవరి 11 నుంచి ఆరంభం కానుంది. తొలి వన్డే 11న వడొదరలో, 14న రెండో వన్డే రాజ్‌కోట్‌లో, మూడో వన్డే 18న ఇండోర్‌లో జరుగుతుంది.

దక్షిణాఫ్రికాతో ఈడెన్‌గార్డెన్స్‌ టెస్టులో మెడ నొప్పితో బాధపడిన శుభ్‌మన్‌ గిల్‌.. గువహటి టెస్టుతో పాటు సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం మెడ గాయం నుంచి కోలుకుని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సాధించిన గిల్‌ వన్డే జట్టులోకి తిరిగి రావటంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కష్టసాధ్యమైన క్యాచ్‌ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్లీహంలో చీలిక గాయానికి గురయ్యాడు. అంతర్గత రక్త స్రావంతో ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొన్న అయ్యర్‌కు ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. బెంగళూర్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో రెగ్యులర్‌ ఫిట్‌నెస్‌తో పాటు శుక్రవారం సీఓఈ గ్రౌండ్స్‌లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సైతం నిరూపించుకున్నాడు.

అయినా, గత సెప్టెంబర్‌ తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టని శ్రేయస్‌ అయ్యర్‌కు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ మరోసారి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది. ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైతే వన్డే జట్టులో చోటుతో పాటు వైస్‌ కెప్టెన్‌గా అయ్యర్‌ కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరగా వన్డే మ్యాచ్‌ ఆడిన మహ్మద్‌ సిరాజ్‌ ఇటీవల దేశవాళీ సర్క్యూట్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలోనూ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. గాయాల నుంచి కోలుకుని భారత జట్టులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు ఈ నెల 6న విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ముంబయి తరఫున శ్రేయస్‌ అయ్యర్‌.. గోవాతో మ్యాచ్‌లో పంజాబ్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగుతారు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తిలక్‌ వర్మ, ధ్రువ్‌ జురెల్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ రుతురాజ్‌ గైక్వాడ్‌ రాయ్ పూర్‌ వన్డేలో 105 పరుగుల శతక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయినా, రుతురాజ్‌ తాజాగా కివీస్‌తో సిరీస్‌కు జట్టులో చోటు నిలుపుకోలేకపోయాడు. ఇక భారత జట్టులో శుభ్‌మన్‌, అయ్యర్‌తో పాటు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, యశస్వి జైస్వాల్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్లు. సఫారీతో సిరీస్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లుగా జట్టులో కొనసాగుతున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండర్లు కాగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌. హర్షిత్‌ రానా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ విభాగంలో ఉన్నారు. హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ కోసం అతడికి సెలక్షన్‌ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. గతంలో సీఓఈ వైద్య బృందం సైతం హార్దిక్‌ పాండ్య ఓ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు.

భారత వన్డే జట్టు
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, హర్షిత్‌ రానా, ప్రసిద్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అర్ష్‌దీప్‌ సింగ్‌, యశస్వి జైస్వాల్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -