నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంలోనే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండేండ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి స్థానంనుంచి తప్పుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధన్ఖడ్ రాజీనామాపై విపక్షాలు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. కనీసం వీడ్కొలు సమావేశం లేకుండా ధన్ఖడ్ను అమానించారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. అదే విధంగా రాజీనామా తర్వాత పలు రోజులు ఆయన మీడియాకు, పలు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ఆదృశ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా ఆయన వార్తాల్లో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే పింఛనుకు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టారు.
ధనఖడ్ గతంలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మేర్లోని కిషన్గఢ్ నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఆ సమయంలో రూల్స్ కమిటికీ సభ్యుడిగానూ పనిచేశారు. నిబంధనల ప్రకారం.. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే రూ.35వేల పింఛనుకు అర్హులు. అలాగే వయసు ఆధారంగా ఆ మొత్తంలో పెంపు ఉంటుంది. 70 ఏళ్లు దాటిన మాజీ సభ్యుడికి 20 శాతం అదనపు పింఛను అందుతుంది. అదే 80 ఏళ్లు దాటితో అది 30 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మాజీ ఉపరాష్ట్రపతి వయసు 74 ఏళ్లు. దాంతో ఆయనకు రూ.42 వేలవరకు పింఛను లభించనుంది.
ఈ పింఛను దరఖాస్తు అందిందని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని వెల్లడించారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ధన్ఖడ్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. లోక్సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 2003లో భాజపాలో చేరారు. 2019 నుంచి 2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా నియమితులైన ధన్ఖడ్.. రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే అనూహ్యంగా వైదొలిగారు. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు.