Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజగ్గారెడ్డి, ధర్మపురి అరవింద్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలి

జగ్గారెడ్డి, ధర్మపురి అరవింద్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలి

- Advertisement -

అదనపు డీజీపీకి బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌ను గురువారం హైదరాబాద్‌లో ప్రవీణ్‌కుమార్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో పోలీసుల ప్రతిష్ట, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి హోం శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 89 క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనీ, ఆయన పాలనలో, రాష్ట్రం అతలాకుతలమైందని విమర్శించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ నాయకులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు/కార్పొరేటర్‌ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కాంగ్రెస్‌ నాయకులు కిడ్నాప్‌ చేసే అవకాశాలున్నాయని ఆరోపించారు. పోలీసులను కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి దుర్భాషలాడటాన్ని ఖండించారు. జగ్గారెడ్డి విషయంలో ఎందుకు సుమోటో కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదని అడిగారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, తుంగబాలు, కిశోర్‌గౌడ్‌, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -