నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ సెటైర్ల వేశారు. ”తరచుగా ప్రయాణించే సూపర్ ప్రీమియమ్ ప్రధాని ” ఐదు దేశాల ‘విహారయాత్ర’కు బయలుదేరారని ఎద్దేవా చేశారు. మణిపూర్ ఉద్రిక్తతలు, భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదనలు సహా నాలుగు అంశాలపై సమాధానం చెప్పకుండా ప్రధాని మోడీ తప్పించుకుంటున్నారని మండిపడింది. ప్రధాని మోడీ నిర్ణయం వల్లే ఆపరేషన్ సిందూర్లో మొదటి రెండు రోజుల్లో భారత్ తిరోగమనం ఎదుర్కొందని రక్షణ అధికారులు వెల్లడించిన ఆరోపణల నుండి ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ ఆరోపించారు.
‘కష్టసమయంలోనూ కొందరు వ్యక్తులు ధైర్యంగా ముందుకు సాగుతారు. కానీ తప్పించుకునేందుకు ”తరచుగా విదేశాలకు ప్రయాణించే” మన ప్రధాని 8 రోజుల విహార యాత్రకు బయలుదేరారు’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నాలుగు సమస్యల నుండి ఆయన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పట్టాలు తప్పినప్పటి నుండి, అక్కడి ప్రజలు సాధారణ జీవన పరిస్థితుల నుండి దూరమైనా ప్రధాని మోడీ ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో ప్రధాని మోడీ నిర్ణయాల కారణంగా భారత్ కొంత మేర నష్టాన్ని ఎదుర్కొందని రక్షణ అధికారులు వెల్లడించిన వార్తలపై సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు ప్రధానిమోడీ పారిపోతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు.
బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమ్మిట్ పాల్గొనడంతో పాటు ఎనిమిదిరోజుల పర్యటనలో ప్రధాని మోడీ గనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, నమీబియాలను సందర్శించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఇఎ) వెల్లడించింది.