సెమీస్లో బెంగాల్పై గెలుపు
కోల్కతా : రంజీట్రోఫీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్ టైటిల్ పోరుకు చేరుకుంది. గత సీజన్లో క్వార్టర్ఫైనల్కు చేరుకుని ఔరా అనిపించిన జమ్మూ కశ్మీర్.. ఈ ఏడాది ఏకంగా ఫైనల్లోనే పాగా వేసింది. కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో బెంగాల్పై 6 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్ ఘన విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వన్సాజ్ శర్మ (43 నాటౌట్, 83 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అబ్దుల్ సమద్ (30 నాటౌట్, 27 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), శుభమ్ (27, 58 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసిన బెంగాల్.. పేసర్ మహ్మద్ షమి (8/90) విజృంభణతో జమ్మూ కశ్మీర్ను తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకు ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 26 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. కానీ రెండో ఇన్నింగ్స్లో 99 పరుగులకు కుప్పకూలిన బెంగాల్ నాల్గో రోజు ఆటలోనే ఫైనల్ బెర్త్ను జమ్మూ కశ్మీర్కు కోల్పోయింది. జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నకిబ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.



