హైదరాబాద్పై 3 వికెట్లతో గెలుపు
రాజ్కోట్ : విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ సంచలన విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్-బి ఆఖరు మ్యాచ్లో హైదరాబాద్పై ఆ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 269 పరుగుల ఛేదనలో జమ్మూ కాశ్మీర్ ఓ దశలో 90/7తో ఓటమి కోరల్లో కూరుకుంది. మహ్మద్ సిరాజ్ (2/45), సివి మిలింద్ (2/54) మెరవటంతో ఛేదనలో జమ్మూ కాశ్మీర్ బ్యాటర్లు విలవిల్లాడారు. దీక్షంత్ (4), కవాల్ప్రీత్ (10), వివ్రాంత్ (13), సాహిల (4), అబిద్ (4), శుభమ్ (22), హసన్ (20)లు తేలిపోయారు. 22.5 ఓవర్లలోనే 90 పరుగులకే జమ్మూ కశ్మీర్ 7 వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ గెలుపు లాంఛనమే అనుకుంటే.. ఆఖిబ్ నబి (114 నాటౌట్, 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లు), వన్సాజ్ శర్మ (69 నాటౌట్, 78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్కు అజేయంగా 182 పరుగులు జోడించారు.
పేస్, స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ.. హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. 47.5 ఓవర్లలోనే 272/7తో జమ్మూ కాశ్మీర్కు అదిరే విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 268/9 పరుగులు చేసింది. అమన్ రావు (60), రాహుల్ సింగ్ (56), నితీశ్ రెడ్డి (54) అర్థ సెంచరీలతో రాణించారు. ఎలైట్ గ్రూప్-బి నుంచి ఉత్తరప్రదేశ్, విదర్భ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ గ్రూప్లో వరుసగా 5, 6వ స్థానాల్లో నిలిచాయి. సోమవారం నుంచి బెంగళూరులో జరుగనున్న క్వార్టర్ఫైనల్స్లో కర్నాటకతో మంబయి, ఉత్తరప్రదేశ్తో సౌరాష్ట్ర, పంజాబ్తో మధ్యప్రదేశ్, ఢిల్లీతో విదర్బ తలపడుతాయి.



