మూడు భాషల విధానం నిన్నటి వరకు మా తరానికి బాగా అనిపించి ఉండొచ్చు! నేటి తరం ఆలోచిస్తోంది… అవసరమైతే మార్కుల కోసం మాతృభాషలను కాదని సంస్కృతం వైపు మళ్ళుతోంది. ఇంటర్లో మార్కుల కోసం తోడ్పడ్డ సంస్కృతం తరువాతి జీవితంలో ఉపయోగపడదని తెలిసినా నేటి తరం అటువైపు వెళ్ళకుండా ఉండలేకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు వంటి భాషలు రేపటి తరానికి అందుతున్న క్రమంలో కారణాలు మనందరం అయినా ఒక ఖాళీ ఏర్పడుతుందన్న భయం కూడా కొంత వరకు తల్లితండ్రులకు, భాషోపాధ్యాయులకు, భాషాభిమానులకు లేపోలేదు. అయితే అటు మాతృభాషను…. ఇటు బడి భాషను, తప్పని సరిగా రెండవ, మూడవ భాషను నేర్చుకుని, చదివి రాణిస్తున్న చిన్నారులు కూడా ఉన్నారు. రాణించడమే కాదు చక్కని రచనలు కూడా చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన చిరంజీవి ఆస్మిన్.
ఆస్మిన్ ఇంటి భాష ఉర్దూ… అమ్మా నాన్నలు శ్రీమతి మహమ్మద్ రుక్సానా – నసిరుద్దీన్లు. ఈమె నవంబర్ 26, 2006లో జగదేవ్ పేటలో పుట్టింది. ఈమె అమ్మ బీడీకార్మికురాలు, తండ్రి రోజువారి కూలీ. ఎనిమదవ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకున్న ఆస్మిన్ 10వ తరగతి ధర్మపురిలోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలో పూర్తిచేసింది. జగిత్యాల మైనార్టీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే తన తెలుగు ఉపాధ్యాయుడు, బాల వికాస కార్యకర్త, కావ్యకర్త కందుకూరి భాస్కర్ మార్గదర్శనంలో తెలుగులో చక్కని రచనలు చేయడం మొదలు పెట్టింది.
ఏడు ఎనమిదవ తరగతుల్లో తొలుత చక్కని కవితలు రాసిన ఆస్మిన్ తరువాత కథల వైపు మళ్ళింది. పాఠశాలలోనూ, అటు కళాశాలలోనూ తనకు లభించిన తెలుగు బోధకుల ప్రేరణతో రచయిత్రిగా నిలవగలిగింది. ఈ చిన్నారి చెల్లలే ఆఫ్రిన్ కూడా అక్క బాటలోనే నడుస్తూ రచనలు చేయడం విశేషం. నేటి నిజం మొదలుకుని ప్రజాశక్తి, ప్రజా మంటలు, బాలబాట, గడుగ్గారు వంటి బాలల కథలు ప్రచురించే పత్రికల్లో ఆస్మిన్ కథలు అచ్చయ్యాయి. 2024లో ‘పూల వ్యాపారం’ కథకు కథా మంజరి వారి బహుమతిని ఈ బాల కథకురాలు అందుకోవడం విశేషం. బాలల బంధువు గరిపెల్లి అశోక్, బాలల కథల మాంత్రికుడు సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య, ఎన్నవళ్ళి రాజమౌళి వంటి కథల తాతయ్యల ఆశీస్సులు, అభిమానం పొందిన ఆస్మిన్ కథలు ‘అక్కా-చెల్లెల్లు’ పేరుతో సంకలనంగా వచ్చింది. ఇది ఈ కథల చంద్రిక అందించిన షోడష కథల మాలిక. పదహారు వెన్నెలల గీతిక. బాలల కథలు అనగానే నేడు చేయి తిరిగిన కథకులు కూడా చందమామ మూసలో రాస్తున్న క్రమంలో ఎదిగిన కథకురాలిగా రాసింది ఆస్మిన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథలన్నీ విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించేవిగా ఉండడం విశేషం. ఈమె పల్లె తోటలో పూసిన మల్లె కదా! ఆ నేపథ్యం తన రచనల్లో చూడొచ్చు. ‘సేంద్రీయ ఎరువుల’ కథ ఇలాంటిదే. ఈ తరానికి ఎరువుల గురించి తెలవడమే తక్కువ, అందులోనూ సేంద్రీయ ఎరువుల గురించి ఆలోచించలేం. ఈ కథలో ఆస్మిన్ ఉన్నత చదువులు చదువుకున్న ఇద్దరు విద్యార్థులు సేంద్రీయ ఎరువుల పట్ల ఆకర్షితులై, సేంద్రీయ ఎరువుల తయారీని ప్రారంభించి ఎలా విజయం సాధించారో చెబుతుంది. ఈ చిన్నారి పెద్దలు చెప్పినట్టు నీతులు, బుద్దులు చెప్పి ఊరుకోలేదు. విజయాల గాథలను కథలుగా మలిచింది. తనకు కథా మంజరి సంస్థ వారి బహుమతిని తెచ్చిపెట్టిన కథ ‘పూల వ్యాపారం’, ఈ కథలో మనిషి అడ్డదారుల్లో నడిచి దొంగతనం వంటివి చేయకూడదని, శ్రమించి పనిచేయాలని నర్మగర్భంగా చెబుతూ రాస్తుంది. మరో కథలో విద్యను గురించి, విద్య విలువను గురించి చెబితే, ఇంకో కథలో అక్కా చెల్లెళ్ల మధ్య ఉండే ఆప్యాయతలు, అనురాగాలు, చిలిపి తగాదాల తద్వారా బలపడే అనుబంధాలను తెలుపుతుంది.
పిట్ట కొంచెం కూత ఘనం అనడం మనకు తెలుసు. అది ఆస్మిన్ రచనల్లో చూడవచ్చు. ఇందులోని కథల్లో ‘బహుమతి’ కథ దానినే చూపిస్తుంది. అందులోనూ కవి, రచయితను గురించి రాయడం నిజంగా విశేషమే మరి. ఇందులో కవి బహుమతులు కావచ్చు, మరోటి, ఇంకోటి కావచ్చు వేటికీ ఆశపడకుండా సమాజ హితం కోసం రచనలు చేయాలని, తన రచనలు సామాజిక చేతన, మార్పులకు తోడ్పడాలని రాస్తుంది. ఇదే కోవలో ‘ఉగాది పండుగ’, ‘కమలాకరుడి పెండ్లి’ వంటి కథలు కూడా చక్కగా చదివించేవి. మాతృభాష ఉర్దూ అయిన ఆస్మిన్ రాయడం విశేషమైతే, ఈ రచనల్లో ఇంకో విశేషం మనకు కనిపిస్తుంది. అదేంటో తెలుసా! తన రచనల నేపథ్యంలో ప్రతి కథ తరువాత ఆ కథలో నిక్షిప్పమైవున్న వ్యాకరణ విశేషాల గురించి ప్రస్తావించడం. ఉదాహరణకు ‘కాకి సహాయం’ కథ ఉంది. ఆ కథ పూర్తికాగానే ‘ఇందులోని అసమాపక క్రియలను గుర్తించండి’ అంటుంది. ‘అక్కా-చెల్లెలు’ కథ కాగానే ‘ఇందులోని సామెతలను గుర్తించండి’ అని రాసింది. తన కథలను చక్కని వ్యాకరణం నేర్చుకునేందుకు ఆకరాలుగా మలచడం బాగుంది. ఇలాగే సంధులు, ఇతర వ్యాకరణాంశాలను గురించి అడుగుతుంది. చక్కని చిక్కని తెల్లని కథల ఈ జగిత్యాల జాస్మిన్… ఆస్మిన్కు దిల్సే దువా! ఈ కథలకు ఖుషామదీద్!
– డా|| పత్తిపాక మోహన్
9966229548
జగిత్యాల బాల కథల జాస్మిన్… ‘ఆస్మిన్’
- Advertisement -
- Advertisement -