Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జేఈఈ, నీట్‌, క్లాట్‌ కోచింగ్‌

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జేఈఈ, నీట్‌, క్లాట్‌ కోచింగ్‌

- Advertisement -

ఎడ్‌టెక్‌ సంస్థ ఫిజిక్స్‌ వాలాతో ఇంటర్‌ బోర్డు భాగస్వామ్యం: విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ అచీవర్స్‌-2025 ఉచిత కోచింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షలకు ఉచిత, నాణ్యమైన ఆన్‌లైన్‌ కోచింగ్‌ను అందిస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎడ్‌టెక్‌ సంస్థ ఫిజిక్స్‌ వాలతో భాగస్వామ్యంగా అమలు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అధికారులతో చర్చించారు. జులై నుంచి ప్రారంభమై డిసెంబర్‌ వరకు ఫిజిక్స్‌ వాల భాగస్వామ్యంతో కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. జేఈఈ, నీట్‌, క్లాట్‌ తరగతులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన లాగిన్‌ వివరాలు కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులకు అందిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశముంటుందని అన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ముందు తల్లిదండ్రులు, అధ్యాపకులతో ప్రత్యేక అవగాహన సమావేశాలను కాలేజీల ప్రిన్సిపాళ్లు నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా ప్రతి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి క్రీడా పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌, ఇంటర్‌ బోర్డు సీవోఈ జయప్రదబాయి తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -