సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సొంతం
నవతెలంగాణ – పుణె
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జార్ఖండ్ సొంతమైంది. విధ్వంసక బ్యాటర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో జార్ఖండ్ అద్భుత విజయం సాధించింది. గురువారం పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హర్యానాపై జార్ఖండ్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (101, 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్తో శతకబాదాడు. కుమార్ కుశాగ్ర (81, 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లు), రాబిన్ మింజ్ (31 నాటౌట్, 14 బంతుల్లో 3 సిక్స్లు), అనుకూల్ రాయ్ (40, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) దంచికొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో హర్యానా చేతులెత్తేసింది. జార్ఖండ్ బౌలర్లు సుశాంత్ మిశ్రా (3/27), వికాశ్ సింగ్ (2/30), బాల్ కృష్ణ (3/38), అనుకూల్ రాయ్ (2/41) రాణించటంతో హర్యానా బ్యాటర్లు తడబడ్డారు. అంకిత్ కుమార్ (0), ఆశీష్ సివాచ్ (0) డకౌట్గా నిష్క్రమించగా.. అర్ష్ రంగా (17), పార్థ్ వాట్స్ (4), సుమిత్ కుమార్ (5) తేలిపోయారు. యశ్వర్దన్ దలాల్ (53), నిశాంత్ సింధు (31), సమంత్ జాకర్ (38) మెరిసినా.. అప్పటికే టైటిల్ జార్ఖండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది.



