– లక్నోపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపు
– ప్లే ఆఫ్స్లో పంజాబ్తో బెంగళూరు,
– గుజరాత్తో ముంబయి ఢీ
– ముగిసిన ఐపిఎల్ లీగ్ మ్యాచ్లు
లక్నో: చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అజేయ శతకంతో మెరిసినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 228పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. నిర్ణయాత్మక మ్యాచ్లో నెగ్గిన బెంగళూరు జట్టు టాప్-2లోకి ఎగబాకింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు బెంగళూరు ముందు 228పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 18.4ఓవర్లలో 4వికెట్ల కోల్పోయి 230పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సీజన్లో ఇదే భారీ ఛేదన కాగా.. బెంగళూరు జట్టు కూడా ఇంత పెద్ద భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. బెంగళూరు జట్టులో కోహ్లి(54), మయాంక్ అగర్వాల్(41నాటౌట్), జితేశ్ శర్మ(85నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జితేశ్ శర్మకు దక్కింది.
అంతకుముందు ఈ సీజన్లో రికార్డు ధర పలికిన పంత్ ఆఖరి పోరులో తనదైన షాట్లతో అలరిస్తూ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన పంత్.. ఓపెనర్ మిచెల్ మార్ష్(67)తో రెండో వికెట్కు కలిసి 152 పరుగులు జోడించాడు. అనంతరం నికోలస్ పూరన్(13) జతగా స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దీంతో తొలిగా బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 227పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు షాకిచ్చినట్లే.. ఈసారి ఆర్సీబీపై చెలరేగింది. ఆరంభంలోనే ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్(14)ను నువాన్ తుషార యార్కర్తో బౌల్డ్ చేశాడు. దాంతో 25 వద్ద లక్నో మొదటి వికెట్ పడింది. మిచెల్ మార్ష్(67), రిషభ్ పంత్(118 నాటౌట్)లు.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. దయాల్ వేసిన 4వ ఓవర్లో 6, రెండు ఫోర్లతో 18 రన్స్ సాధించిన పంత్.. పవర్ ప్లే తర్వాత మరింత చెలరేగాడు. భువనేశ్వర్ను ఉతికేస్తూ.. వరుసగా 6, 4 బాదిన లక్నో సారథి.. అనంతరం సుయాశ్ శర్మకు వరుస ఫోర్లతో చుక్కలు చూపించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, లక్నో 10 ఓవర్లకు 101 రన్స్ చేసింది. ఆ తర్వాత జోరు పెంచిన మార్ష్ కూడా సుయాశ్ ఓవర్లోనే సిక్సర్తో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ సీజన్లో ఏడో ఫిఫ్టీ బాదిన ఈ చిచ్చరపడిగు భువనేశ్వర్ ఓవర్లో ఔటయ్యాడు. దాంతో, రెండో వికెట్కు 152 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ప్లే-ఆఫ్స్ బెర్త్లు ఖరారు :
చివరి లీగ్ మ్యాచ్లో నెగ్గిన బెంగళూరు జట్టు టాప్-2లోకి ఎగబాకింది. దీంతో 29న జరిగే తొలి క్వాలిఫయర్లో బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. 30న గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్-1 మ్యాచ్ జరగనుంది.
స్కోర్బోర్డు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి)దిగ్వేష్ (బి)ఆకాశ్ మహారాజ్ సింగ్ 30, కోహ్లి (సి)ఆయుష్ బడోని (బి)ఆవేశ్ ఖాన్ 54, పటీధర్ (సి)అబ్దుల్ సమద్ (బి)రూర్కే 14, లివింగ్స్టోన్ (ఎల్బి)రూర్కే 0, మయాంక్ అగర్వాల్ (నాటౌట్) 41, జితేశ్ శర్మ (నాటౌట్) 85, అదనం 6. (18.4ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 230పరుగులు.
వికెట్ల పతనం: 1/61, 2/90, 3/90, 4/123
బౌలింగ్: ఆయుష్ మహరాజ్ 4-0-40-1, రూర్కే 4-0-74-2, దిగ్వేష్ 4-0-36-0, షాబాజ్ అహ్మద్ 3-0-39-0, ఆవేశ్ ఖాన్ 3-0-32-1, ఆయుష్ బడోని 0.4-0-9-0.
జిల్.. జిల్.. జితేశ్
- Advertisement -
- Advertisement -