నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన ఆదరణ లభించింది. మండలానికి చెందిన బిజెపి పార్టీకి ఫౌండర్ గా ఉన్న కృష్ణ పటేల్ రౌత్వార్, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలు తమను ఆకర్షించాయని, అదే కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నూతన సభ్యులు తెలిపారు. ఈ భారీ చేరికల కార్యక్రమం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ విధానాలు, నాయకత్వంపై పెరిగిన విశ్వాసమే ఈ చేరికలకు ప్రధాన కారణమని నాయకులు స్పష్టం చేశారు.
సర్పంచులకు ఘన సన్మానం – గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అండ
అనంతరం మద్నూర్ మండలం నుంచి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన సర్పంచులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..,గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజాప్రతినిధులకి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




