– ఏఐఎస్టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. సదానందం గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిం పునివ్వాలని, పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షలు జి.సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేండ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని కోరారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని వారు విమర్శించారు. తీర్పు వచ్చి నాలుగు నెలలైందనీ, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్పై కొందరు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (ఏఐజాక్టో) అధ్వర్యంలో ఉమ్మడి ఉద్యమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో నాయకులు పరమేశ్, సాబేర్ అలి, పున్న గణేష్, శ్రీశైలం, శ్రీధర్ పాల్గొన్నారు.
టెట్పై జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



