ఐదు వామపక్షాల పిలుపు
పాలస్తీనాపై భారత్ వైఖరి మారాలని డిమాండ్
న్యూఢిల్లీ : జూన్ 17ను పాలస్తీనా జాతీయ సంఘీభావ దినంగా పాటించాలని ఐదు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఎఐఎఫ్బి, ఆర్ఎస్పిలు పిలుపిచ్చాయి. గాజాలో సుదీర్ఘకాలంగా ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న మారణకాండను ఖండించాయి. తక్షణమే పాలస్తీనా విషయమై భారత్ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐదు పార్టీల నేతలు – సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య, ఎఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్, ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్యలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికి 20 మాసాలకు పైగా ఇజ్రాయిల్ ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా బాంబు దాడులకు, సైనిక దురాక్రమణలకు పాల్పడుతునే వుంది. ఈ దాడుల్లో 55వేలమందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో మెజారిటీ మహిళలు, చిన్నారులే. ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేశారు. గాజా ప్రజలను కనివినీ ఎరుగని మానవతా విపత్తులోకి నెట్టివేశారు. ఇది జాతి నిర్మూలన కంటే తక్కువేమీ కాదు. గాజాలోకి ఆహారాన్ని ప్రవేశించనివ్వకుండా నిరాకరించడం అంతకంటే అమానవీయమైన అంశం. గాజాకు సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ ఫ్లోటిల్లాకు చెందిన మాడ్లీన్ ఓడపై ఇజ్రాయిల్ జరిపిన దాడిని కూడా వామపక్షాలు ఖండించాయి. అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని, గాజాలోకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మానవతా సాయం వెళ్ళేలా చూడాలని, అమానవీయమైన ఈ దిగ్బంధనానికి తక్షణమే స్వస్తి పలకాలంటూ డిమాండ్ చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సహా అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం మాత్రం అమెరికా మరికొంతమంది మిత్రదేశాల మద్దతుతో ఎలాంటి శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా తన క్రూరమైన వ్యవహార శైలిని కొనసాగిస్తోంది. రఫాపై ఇటీవల జరిగిన దాడి, అలాగే ఇప్పటికే నిర్వాసితులైన వేలాదిమంది పాలస్తీనియన్లను మళ్ళీ మళ్ళీ వారున్న ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం చూస్తే అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులు, మౌలికమైన మానవత్వం ఇలా వేటినీ ఇజ్రాయిల్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రుజువవుతోంది. తాజాగా అంతర్జాతీయ జలాల్లో వుండగా ఫ్రీడమ్ ఫ్లోటిల్లా నౌకను హైజాక్ చేసిన ఘటనతో విస్తృత రీతిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు పాలస్తీనియన్లకు భారత్ చారిత్రకంగా మద్దతునిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం పాలస్తీనియన్ల ప్రయోజనాల కోసం వారికి అండగా నిలబడడానికి బదులుగా భారత ప్రభుత్వం, దురాక్రమణదారైన ఇజ్రాయిల్ పట్ల సందిగ్థ, బుజ్జగింపు వైఖరిని అవలంబించడం తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అంశం. వలసవాద వ్యతిరేక సంఘీభావం, జాతి విమోచన ఉద్యమాలకు మద్దతునిస్తూ భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చిన విదేశాంగ విధానం నుండి అత్యంత సిగ్గుచేటైన రీతిలో పక్కకు మళ్లడమే ఇది.
దేశవ్యాప్తంగా జూన్ 17ను పాలస్తీనా జాతీయ సంఘీభావ దినంగా పాటించేందుకు అందరూ చేతులు కలపాలంటూ శాంతి కాముకులు, ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులను వామపక్షాల నేతలు ఆ ప్రకటనలో కోరారు. ఆ రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉదయం 11గంటలకు ప్రదర్శన నిర్వహించబడుతుంది.
– ఇజ్రాయిల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను, యుద్ధ నేరాలను ఖండించాలి
– జాతీయత, గౌరవం, స్వేచ్ఛ కోసం పాలస్తీనా ప్రజలు సాగిస్తున్న న్యాయమైన పోరాటంలో వారికి సంఘీభావాన్ని ప్రకటించాలి.
– పాలస్తీనా ప్రయోజనాలకు మనం ఇచ్చిన చారిత్రక మద్దతుకు అనుగుణంగా భారత ప్రభుత్వం సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవాలి. ఇజ్రాయిల్కు సైనిక, భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలి.
– మారణకాండ, వివక్షత, ఆక్రమణలకు వ్యతిరేకంగా భారత్ ప్రజల వాణిని వినిపించేందుకు ఈ సంఘీభావ ప్రదర్శనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు.
గాజాలో మారణకాండ ఆపాలి :పాలస్తీనియన్లకు వికలాంగుల సంఘీభావం
గాజాలో మారణకాండను ఇజ్రాయిల్ ఆపాలని దేశవ్యాప్తంగా అనేక వికలాంగ సంస్థలు, ప్రముఖ వికలాంగ వ్యక్తులు డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా అన్యాయానికి గురవుతున్న పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనకు ఐద్వా, ఎఐకెఎస్ వంటి సంస్థలు కూడా ఆమోదం తెలిపాయి. గాజాకు మానవతా సాయాన్ని అందచేయడానికి ప్రయత్నించిన 12 మంది అంతర్జాతీయ కార్యకర్తలను ఇజ్రాయిల్ దళాలు అడ్డగించి, నిర్భంధించడాన్ని ప్రకటనలో వికలాంగులు తీవ్రంగా ఖండించారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు, ఆహార ధాన్యాలు, వైద్య సామాగ్రి, ఇతర పరికరాలు వంటి సామాగ్రి తీసుకొని వెళుతున్న వీరిని ఈ నెల 8న నిర్భంధించడాన్ని పాలస్తీయుల్ని ఆకలితో చంపడం, ఒంటరి చేయడం వంటి విస్తృత వ్యూహంలో భాగమని విమర్శించారు. గాజాలో జరుగుతున్నది యుద్ధం కాదని, ఒక జాతి నిర్మూలన అని ప్రకటన పేర్కొంది. ఇజ్రాయిల్ దళాలు అధిక ప్రభావ పేలుడు పదార్థాలు, రసాయన ఆయుధాలు ఉపయోగించడం, మౌలిక సదుపాయాలను క్రమబద్ధంగా నాశనం చేయడం వంటి కారణాలతో గాజాలో మృతులతో పాటు, వికలాంగుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని ప్రకటన ఆవేదన వ్యక్తం చేసింది. పాశ్చాత్య సామ్రాజ్య శక్తుల మద్దతుతో గాజాపై ఇజ్రాయిల్ ఏకధాటిగా బాంబు దాడులు, దిగ్బంధనం, సాయం అడ్డుకోవడం..వంటి చర్యలతో ప్రజలపై విధ్వంసానికి పాల్పడుతోందని ప్రకటన పేర్కొంది. ఇప్పటికే గాజాలో ఆహార వ్యవస్థలు, ఆసుపత్రులు బాంబు దాడితో నాశనమయ్యాయని, పరిశుభ్రమైన నీరు, ఔషధాలు ప్రజలకు అందడం లేదని, ఇలాంటి సమయంలో గ్రెటా థన్బర్గ్, రిమా హసన్, లియామ్ కన్నింగ్హామ్ వంటి 12 మంది అంతర్జాతీయ కార్యకర్తలను నిర్భంధించడాన్ని ఒక బెదిరింపు చర్యగా ప్రకటన ఖండించింది. నిర్బంధించిన రాజకీయ ఖైదీలందర్నీ తక్షణమే విడుదల చేయాలని ప్రకటన డిమాండ్ చేసింది. అలాగే, తక్షణమే కాల్పుల విరమణ చేయాలని పేర్కొంది. ఈ ప్రకటనపై పశ్చిమబంగ రాజ్య ప్రతిబంధి సమ్మిలని, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (తెలంగాణ), వికలాంగుల సంక్షేమ సంఘం (కేరళ), హర్యానా వికలాంగ్ అధికార్ మంచ్ వంటి సంస్థలు సంతకం చేశాయి.
జూన్ 17న పాలస్తీనా సంఘీభావ దినం
- Advertisement -
- Advertisement -