– సామూహిక లైంగికదాడిపై భారీ నిరసనలు
– ప్రజాసంఘాలపై లాఠీచార్జి
కోల్కతా : దక్షిణ కోల్కతా లా కాలేజీ విద్యార్ధినిపై ఈ నెల 25న సామూహిక లైంగికదాడి ఘటనను నిరసిస్తూ కోల్కతాలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. లా కాలేజీ గేటువద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల ఫోటోలను వేలాడదీసి వాటిని చించివేస్తూ నిరసన తెలిపారు. కోల్కతా పోలీసు స్టేషన్ ఎదురుగా శుక్రవారం రాత్రి వరకు వారు నిరసన చేపట్టారు. ఈ సమయంలో వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. మహిళలతో సహా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి కూడా తీసుకున్నారు. రేపిస్ట్లకు పోలీసులు ఎందుకు కాపలా కాస్తున్నారని ఆందోళనకారులు ప్రశ్నించారు. అభయా మంచాకు చెందిన డాక్టర్లు వెంటనే అక్కడ ఒక క్లినిక్ను తెరిచి, గాయపడిన వారికి చికిత్సనందించారు. తాజా సంఘటనతో రాష్ట్రంలో తృణమూల్ దుష్టపాలన మరోసారి బట్టబయలైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం విమర్శించారు.
ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు
దర్యాప్తునకు కోల్కతా పోలీసులు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సిట్కు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారని సంబంధిత అధికారి తెలిపారు. ఈ బృందం తక్షణమే తన దర్యాప్తును ప్రారంభిస్తుందన్నారు.
కాలేజీ సెక్యూరిటీ గార్డు అరెస్టు
ఈ ఘటనలో ప్రధాన నిందితులైన సీనియర్ న్యాయ విద్యార్థులు మోనోజిత్ మిశ్రా, జుబీర్ అహ్మద్, ప్రామిత్ ముఖర్జీలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, తాజాగా ఆ కాలేజీ సెక్యూరిటీ గార్డ్ పినాకీ బెనర్జీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు బెనర్జీని విచారిస్తున్నారు.
గార్డ్ రూమలోనే తనపై అత్యాచారం జరిగిందని, సెక్యూరిటీ గార్డ్ తనకెలాంటి సహాయం చేయలేదని బాధితులురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గార్డ్ని అరెస్టు చేశారు.
కోల్కతా లా విద్యార్థినికి న్యాయం చేయాల్సిందే
- Advertisement -
- Advertisement -