– ఆహారభద్రతను పక్కనబెట్టిన కేంద్రప్రభుత్వం
– అంబానీ, అదానీ కోసమే కార్పొరేట్ వ్యవసాయం వైపు మొగ్గు
– ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కుట్ర
– జులై 9 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం : ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక న్యాయం పక్కకుపెట్టి కార్పొరేట్లకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు పని చేస్తున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ రోజు 500 జిల్లాల్లో 1000 కేంద్రాల్లో గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులను, ఉపాధి కూలీలను సమీకరించి పోరాటం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగిందని మోడీ గొప్పలు చెప్పుకోవడం మాని.. రైతులు, గ్రామీణ పేదలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే దానిపై దష్టిసారించి అరికట్టాలని సూచించారు. నేషనల్ క్రైం బ్యూరో నివేదిక ప్రకారం దేశంలో ఏడేండ్లలో లక్ష మంది ఆత్మహత్యలు చేసుకున్నారనీ, వారిలో ఎక్కువగా గ్రామీణ పేదలే ఉన్నారని గుర్తుచేశారు. గ్రామాల్లో ఉపాధి తగ్గి ప్రజల కొనుగోలు శక్తి స్థాయి పడిపోయిందనీ, వలసలు పెరుగుతు న్నాయని ఎత్తిచూపారు. ఆహారభద్రతకు తూట్లు పొడుస్తూ దేశంలో వ్యవసాయ రంగాన్ని అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర శరవేగంగా జరుగుతున్నదని విడమర్చి చెప్పారు. దీనికి గ్రామీణ ప్రాంతంలోని ధనిక వర్గం సహకరిస్తున్న తీరును వివరించారు. కంపెనీ వ్యవసాయంతో సన్న, చిన్నకారు, వ్యవసాయ కూలీలు, దానిపై ఆధారపడి బతికేవారు రోడ్డున పడుతారని హెచ్చరిం చారు. గోదాముల్లో నిల్వలు మూలుగుతున్నా పేదలకు 10 కేజీల చొప్పున రేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా పేదలకు పోషకాలతో కూడిన 12 రకాల నిత్యావసరాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తూ పోతున్న తీరును గణాంకాలతో వివరించారు. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యతను కంపె నీలకు ఇవ్వాలన్న ఏపీ సీఎం చంద్రబాబు మాటల్ని ఆయన తప్పుబట్టారు. భూకేంద్రీ కరణను తగ్గించకుండా పేదరికాన్ని నిర్మూలిం చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గ్రామీణ పేదలు ఇండ్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5 లక్షల చొప్పున సహాయం అందజేయాలని సూచించారు. దేశ సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణమని విమర్శించారు. కేంద్రం విధానాలను నిరసిస్తూ జూన్ ఒకటో తేదీ నుంచి 15 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, పనిప్రదేశాల్లో సమావేశాలు నిర్వహిస్తామనీ, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, జీపు జాతాలు నిర్వహిస్తామని చెప్పారు. దేశ సహజ వనరులను రక్షించేం దుకు, కార్మిక, కర్షకుల హక్కులను కాపాడేందుకు జులై 9న తలపెట్టిన దేశభక్తియుత సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు ఎమ్ఎస్పి గ్యారెంటీ చట్టం తేవాలనీ, అదే సమయంలో రైతుకు సాగయ్యే ఖర్చులో 20 శాతాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ… ఉపాధి హామీ చట్టంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతిప్రతాలు కూడా తీసుకోలేని స్థితిలో కలెక్టర్లు, పీడీలు ఉండటాన్ని తప్పుబట్టారు. ఇదేం ప్రజా పాలన అని ప్రశ్నించారు. కాంగ్రె స్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన 150 రోజుల పని కల్పన, పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ విస్తరణ, రోజుకు రూ.400 వేతనం హామీ లను నెరవేర్చాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్.ఆంజనేయులు కూడా పాల్గొన్నారు.
మోడీ పాలనలో కార్పొరేట్లకే న్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES