నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కికి జనరల్ జెడ్ నిరసనకారులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. పార్లమెంట్ను రద్దు చేయాలా వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో తాత్కాలిక ప్రభుత్వ నియామకం ఆలస్యమవుతోంది. నేపాల్ చీఫ్ జనరల్ అశోక్ సిగ్దేల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు రామ్చంద్ర పౌడల్ గురువారం అర్థరాత్రి న్యాయ మరియు రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. శుక్రవారం కూడా చర్చలు కొనసాగనున్నాయని పేర్కొన్నాయి.
జస్టిస్ సుశీల్ కర్కి తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు అన్ని వర్గాలు అంగీకరించాయని అధ్యక్షుడు పౌడెల్ ప్రధాన రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెను అధికారికంగా నియమించడానికి ఏ రాజ్యాంగ నిబంధనను ఉపయోగించాలి, పార్లమెంట్ రద్దు చేయాలా వద్దా అనే అంశంపై గందరగోళం నెలకొంది.
51కి పెరిగిన మృతులు
నేపాల్ ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 51కి చేరినట్లు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు జైళ్ల నుండి తప్పించుకున్న 12,500మందికి పైగా ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారని పోలీస్ ప్రతినిధి బినోద్ ఘిమిరే తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో ధ్వంసం చేయబడిన పోలీస్స్టేషన్లు మరియు చెక్పోస్టులు తిరిగి పనిచేస్తున్నాయని అన్నారు. స్టేషన్లు, బీట్లు మరియు యూనిటుల క్రమంగా తిరిగి తెరవబడ్డాయని, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీస్ దళ సిబ్బంది కార్యకలాపాలను ప్రారంభించారని ఖాట్మాండు లోయ పోలీస్ కార్యాలయం వెల్లడించింది.