Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయంజస్టిస్‌ వర్మవి కట్టుకథలు

జస్టిస్‌ వర్మవి కట్టుకథలు

- Advertisement -

ఆయన వాదనలో పస లేదు : నిర్ధారించిన సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ :
జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలను విచారించిన త్రిసభ్య కమిటీ ఆయన వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ముఖ్యంగా వర్మ రెండు వాదనలను కమిటీ ముందు వినిపించారు. తన ఇంటిలోని సామగ్రి గదిలో ఎవరో నగదును ఉంచి ఉంటారని, తనను కేసులో ఇరికింకేందుకు సామగ్రి గదికి నిప్పు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఈ వాదనలతో ఏకీభవించలేదు. ఆయనను అభిశం సించాలని సిఫార్సు చేసింది. సామగ్రి గదిలోకి ఎవరైనా వెళ్లే అవకాశం ఉన్నదని, కాబట్టి తాను లేని సమయంలో ఎవరో ఆ గదిలో డబ్బు పెట్టి ఉంటారని జస్టిస్‌ వర్మ తనకు మద్దతుగా చెప్పారు. అయితే కమిటీ తన 64 పేజీల నివేదికలో దీనిని తోసిపుచ్చింది. స్టోర్‌రూములోకి వెళ్లాలంటే జస్టిస్‌ వర్మ అనుమతి తప్పనిసరి అని, ఆ గది ఆయన నియంత్రణలోనే ఉన్నదని తేల్చింది.
ఎవరో వచ్చి కరెన్సీ ఎలా పెడతారు?
కమిటీ నివేదిక నేపథ్యంలో జస్టిస్‌ వర్మను పదవి నుంచి తప్పించడం లాంఛనమేనని తేలి పోయింది. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్ల మెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్‌ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభి స్తారు. తనపై కుట్ర జరిగిందని జస్టిస్‌ వర్మ ఎంతగా వాదించినా కమిటీ పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన తుగ్లక్‌ క్రీసెంట్‌ బంగళా వర్మ అధీనంలోనే ఉన్నదని కమిటీ తన నివేదికలో తెలియజేసింది. జస్టిస్‌ వర్మ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎవరూ ఆ బంగళాలో ప్రవేశించలేరంటూ సెక్యూ రిటీ సిబ్బంది ఇచ్చిన స్టేట్‌మెంటును ప్రస్తావిం చింది. ‘సిట్టింగ్‌ జడ్జి నివాసంలోని సామగ్రి గదికి ఎవరో వచ్చి కరెన్సీని పెట్టడం అసంభవం. బంగళా గేటు వద్ద నిరంతరం ఐదుగురు గార్డులు, ఓ పీఎస్‌ఓ ఉంటారు. పైగా ఆ ఇంటిలో అనేక మంది పాత, నమ్మకస్తులైన సేవకులు కూడా ఉన్నారు. ఆ ప్రాంగణంలో వారి కోసం ఆరు క్వార్టర్లు ఉన్నాయి’ అని వివరించింది.
బదిలీకి కారణం కూడా అడగలేదు
సామగ్రి గదికి ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టా రంటూ జస్టిస్‌ వర్మ చేసిన వాదనను కూడా కమిటీ పట్టిం చుకోలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిం దని జస్టిస్‌ వర్మ తొలుత చెప్పారని గుర్తుచేసింది. పైగా ప్రమాదంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేయ లేదని తెలిపింది. ‘అలహాబాద్‌ హైకోర్టుకు తనను బదిలీ చేస్తే జస్టిస్‌ వర్మ నిరాకరించలేదు. వెంటనే అంగీకారం తెలిపారు. మామూలు పరిస్థితుల్లో అయితే కుటుంబ సభ్యు లను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుం టారు. మూడేండ్ల పాటు ఢిల్లీ హైకోర్టులో పనిచేసిన తనను ఎందుకు బదిలీ చేశారో తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ అదేమీ జరగలేదు’ అని చెప్పింది. ఎలాంటి ఫిర్యాదు లేకుండా దశాబ్దకాలం ఆయన సేవలు అందించా రని, కాబట్టి ఆయన తన బదిలీకి కారణమేమిటో తెలుసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.

కుమార్తె, ప్రయివేటు కార్యదర్శి ఏం చేశారంటే…
సెలవులు గడిపేందుకు సత్పురా అటవీ ప్రాంతానికి వెళ్లిన జస్టిస్‌ వర్మ ప్రమాద సమాచారం తెలిసినా మార్చి 15వ తేదీ వరకూ తన బంగళాకు చేరుకోని విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య ప్రయివేటు కార్యదర్శి తనిఖీకి వచ్చినా వర్మ హాజరు కాలేదని తెలిపింది. మంటలు అదుపులోకి వచ్చాయని చెబుతూ వర్మ కుమార్తె అగ్నిమాపక సిబ్బందిని బంగళా లోపలికి రానీయలేదని చెప్పింది. గదిలో కాలిపోయిన నోట్ల కట్టలు ఉన్నాయన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జస్టిస్‌ వర్మ ప్రయివేటు కార్యదర్శి రాజీందర్‌ సింగ్‌ కార్కీ అగ్నిమాపక సిబ్బందికి సూచించారని కమిటీ తెలియజేసింది. అగ్నిమాపక సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత కర్కీ గదిని శుభ్రం చేయించారని మహమ్మద్‌ రహీల్‌ అనే సేవకుడు కమిటీకి చెప్పారు. విచారణ సమయంలో కర్కీ పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారు. విచారణ ప్రారంభం కాగానే మార్చి 15-25 తేదీల మధ్య సీసీటీవీలో నమోదైన దృశ్యాలను హార్డ్‌డిస్క్‌ నుంచి తొలగించడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -