పార్లమెంట్ విచారణ నుంచీ వైదొలగిన వైనం
న్యూఢిలీ : నోట్ల కట్టల కుంభకోణం నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తనపై జరుగుతున్న పార్లమెంటరీ విచారణ నుండి కూడా ఆయన వైదొలగారు..గతేడాది మార్చిలో ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంగా భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వర్మ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. ఈ ఘటన తరువాత ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంతోపాటు, న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తరువాత ఆయనను పదవి నుండి తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.
జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించాలని కోరేందుకు దిగువ సభకు చెందిన వందమందికి పైగా సభ్యులు సంతకాలు చేసిన తీర్మానం నోటీసును అందుకున్న అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విచారణా కమిటీని ఏర్పాటు చేశారు. తనను తొలగించడానికి తీర్మానాన్ని ఆమోదించాలని స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వర్మ పెట్టుకున్న పిటిషన్ను ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. ”ప్రస్తుత విచారణా క్రమంలో పాల్గొనడాన్ని కొనసాగించడం ద్వారా, తద్వారా…ఆ డబ్బు ఎక్కడ నుండి వచ్చింది అనే సమాధానం చెప్పలేని ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని నన్ను కోరే ఈ ప్రక్రియను చట్టబద్ధం చేయడం ద్వారా నేను, నాకూ, ఈ వ్యవస్థకు తీరని అగౌరవాన్ని, అన్యాయాన్ని చేసిన వాడనవుతాను.” అని జస్టిస్ వర్మ తన 13 పేజీల లేఖలో పేర్కొన్నారు.
విచారణా కమిటీనుద్దేశించి ఆయన ఈ లేఖ రాశారు. ”నా నిర్ణయం యొక్క తీవ్రత గురించి తెలిసిన వ్యక్తిగా, అత్యంత తీవ్రమైన విచారంతో నేను వైదొలగుతున్నాను. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పట్ల వ్యవహరించిన అన్యాయాన్ని చరిత్ర ఏదో ఒక రోజు నమోదు చేస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని తొలి నుండి పట్టి పీడిస్తున్న విషయం కూడా చరిత్రలోనమోదవుతుందని భావిస్తున్నా.” అని ఆ లేఖలో పేర్కొన్నారు. తొలి నుండి ఈ కేసులో జరిగిన పరిణామాలన్నీ ఆయన ఆ లేఖలో వివరించారు. అలాగే మొదట నుండి చెబుతున్నట్లుగా తన నివాసంలో దొరికిన ఆ డబ్బు తనది కాదని కూడా చెప్పారు.
నోట్ల కట్టల కుంభకోణం నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
- Advertisement -
- Advertisement -



