Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలి

- Advertisement -

కేసీఆర్‌ అంటేనే కాళేశ్వరం అన్నోళ్లు నోరు మూసుకున్నారు
కేసీఆర్‌ కూడా నాకు సంబంధం లేదంటున్నారు
మావోయిస్టులను లేకుండా చేసేందుకే కగార్‌ ఆపరేషన్‌ :
ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయప్రతినిధి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ప్రజలపై భారం మోపే ప్రాజెక్టును రద్దు చేయాలని అన్నారు. దాని నిర్వహణ కోసం ఏటా వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దని సూచించారు. హనుమకొండ జిల్లాలోని హరిత కాకతీయ హోటల్‌లో శనివారం మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కేసీఆర్‌ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్‌ అన్నోళ్లు నేడు నోరు మూసుకున్నారని, తన మెదడును కరిగించి డిజైన్‌ చేశానని, కాళేశ్వరానికి అన్నీ నేనే అన్న కేసీఆర్‌ ఇప్పుడు నాకు సంబంధం లేదంటున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ బాధ్యత ఇంజినీర్‌లదే అంటూ నేడు తప్పించుకుంటున్నారని, ఇది అన్యాయమని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని, అందుకే కాళేశ్వరానికి మార్చామని చెబుతున్న హరీశ్‌రావు.. జనాలను ముంచే ప్రాజెక్టు కడతారా? అని ప్రశ్నించారు. 140మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని తాము డిమాండ్‌ చేశామని, అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని జిల్లాలకు సాగునీరు అందేదని చెప్పారు. కాళేశ్వరం నిర్మించాక చుక్కనీరు అదనంగా ఇవ్వలేదని, నేడు పంటలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లేనని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులనే లేకుండా చేయాలని చూస్తున్నదని విమర్శించారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే చట్టప్రకారం కేసులు పెట్టాలని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఫ్యూడల్‌, గూండా, ఫాసిస్ట్‌ పాలనకు నిదర్శనం అని విమర్శించారు.కానీ, ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అదీ కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనం అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్‌, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్‌, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -