అప్పుల వడ్డీ రేట్ల తగ్గింపుపై పరిశీలన
కేంద్ర ప్రభుత్వం సమాధానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాకే అప్పులపై వడ్డీ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిం ది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు పేర్కొంది. అంతేకానీ రుణ సవాళ్లను ఎదుర్కొంటోన్న తెలంగాణను అందుకునేదుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. సోమవారం లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల నీటిపారుదల పథకం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)తో సేకరించిన అప్పుల రీస్ట్రక్చర్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అందినట్టు తెలిపారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ), గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నిధులు సమకూర్చాయన్నారు. అయితే ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బీఎఫ్ సీ) అయిన పీఎఫ్సీ, ఆర్ఈసీ లు దేశీయ, ఆఫ్షోర్ మార్కెట్లలోని వివిధ వనరుల నుంచి నిధులను సేకరిస్తాయి వివరించారు. వాటికయ్యే ఖర్చులను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయని, అప్పు తీసుకునే వారి గ్రేడింగ్పై కూడా వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే గడువు పెంచాం
కేఐపీసీఎల్ అభ్యర్థన మేరకు 2024 డిసెంబర్ వరకు పనులు పూర్తి చేయడానికి ఆర్ఈసీ లిమిటెడ్ ఇప్పటికే గడువు పొడిగించిందని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టులు పూర్తైన తరువాత వడ్డీ రేట్ల తగ్గింపుపై పరిశీలన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు. అయితే అప్పుల చెల్లింపు, రీ షెడ్యూల్ మార్పు చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గైడ్ లైన్స్ అనుగుణంగా పీఎఫ్సీ/ఆర్ఈసీల నిబంధనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్-స్టాండర్డ్ డౌన్ గ్రేడ్కు మారుతుందని తెలిపింది.
అయితే… రుణ సేవల సవాళ్లను ఎదుర్కొంటున్న తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ, సహా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక అంశాలు, బడ్జెట్ నిర్వహణ ఎఫ్ ఆర్ బీఎం చట్టాన్ని అనుసరించి జరుగుతాయన్నారు. కేంద్రం ప్రభుత్వం కేవలం పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సహాయం, వివిధ ప్రాజెక్టులకు మద్దతు, మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, వంటి రూపాల్లో మాత్రమే నిధులు అందిస్తోందని మంత్రి వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాకే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES