నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర శాసనమండలిలో సోమవారం రభస చోటుచేసుకుంది. సభా వ్యవహారాలు జరుగుతుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి కూర్చున్న పోడియంను చుట్టుముట్టారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడంపై నిరసిస్తూ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. కమిషన్ రిపోర్టు కాపీలను చించి చైర్మెన్ వైపు విసిరారు. నినాదాలు చేశారు. ఒకవైపు చైర్మెన్ నివారించే ప్రయత్నం చేసినా పోడియం వద్దే నిరసన తెలిపారు. తమ తమ సీట్లే దగ్గరే నిరసన తెలియజేయాలని చైర్మెన్ కోరినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. అక్కడి నుంచి ప్రదర్శనగా అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పటికే సభలో ఆయా బిల్లులను ప్రవేశపెట్టేందుకు వచ్చిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరుపక్షాలు వాదనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. ‘రాహుల్కు సీబీఐ వద్దు..రేవంత్కు సీబీఐ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు రావొద్దని, కేటాయించిన స్థానాల్లోనే నిరసన తెలపాలని సూచించారు. అయినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనల మధ్యే మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్ ప్రయివేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులు సభ ఆమోదం పొందినట్టు మండలి చైర్మెన్ ప్రకటించారు. అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేశారు.
మండలిలో కాళేశ్వరం రభస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES