నవతెలంగాణ-హైదరాబాద్: DMK మిత్రపక్షమైన మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్హాసన్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇవాళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు డీఎంకే (DMK) తరఫున పి.విల్సన్, ఎస్.ఆర్.శివలింగం, కవయిత్రి సల్మా కూడా నామినేషన్ పత్రాలు సమర్పించారు. తమిళనాడు (Tamilnadu) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు ఎన్నికైన అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎన్.చంద్రశేఖరన్ (ఏఐఏడీఎంకే), ఎం.షణ్ముగం, మహ్మద్ అబ్దుల్లా, విల్సన్, వైకోల పదవీ కాలం జూన్ 24తో ముగియనుంది. దీంతో ఖాళీ అయిన స్థానాలకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 19న ఎన్నికకు డేట్ ఫిక్స్ చేసింది. దీంతో తాజాగా నలుగురు రాజ్యసభకు పోటీ చేయనున్నారు.
కాగా, 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం కూడా చేశారు. దాంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే పూర్తి సహకారం అందించనుంది. జూన్ 19న జరిగే రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఎంఎన్ఎం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.