నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు స్వయం రక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు కరాటే శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రథమ పౌరురాలు కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్య అతిథిగా హాజరై కరాటే శిక్షణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న మాట్లాడుతూ బాలికలు కరాటే వంటి స్వయం రక్షణ విద్యను నేర్చుకోవాల్సిన అవసరం, దాని ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం, శారీరక దృఢత్వం ఎలా పెరుగుతాయో వివరించారు. అనంతరం కరాటే మాస్టర్ అవినాష్ బాలికలకు ప్రాథమిక కరాటే కదలికలు, రక్షణ పద్ధతులను ప్రత్యక్షంగా చేసి చూపించి అవగాహన కల్పించారు.బాలికల్లో స్వయం రక్షణపై ఆసక్తిని పెంచి, భవిష్యత్తులో వారు ధైర్యంగా, సురక్షితంగా జీవించేందుకు కరాటే శిక్షణ దోహదపడుతుందని పలువురు మహిళ ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



