– అభ్యంతరకర వ్యాఖ్యలపై కలెక్టర్ సీరియస్
– విద్యాశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వివాదాస్పద డీఈఓగా తరచూ వార్తల్లో నిలుస్తున్న జనార్ధన్రావుపై ఎట్టకేలకు వేటు పడింది. తొలి నుంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం ఉపాధ్యాయ వర్గాల్లో కంట్లో నలుసుగా మారిన ఆయనపై సరెండర్ వేటు పడింది. ఇటీవల టీచర్ల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ‘వంట రాకపోతే మీ ఆవిడ ఉండదురా బాబు, లేచి పోతుంది’ అంటూ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించారు. ఆ వ్యాఖ్యలు మహిళా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు రావడంతో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తక్షణమే స్పందించారు. జనార్ధన్రావును విద్యాశాఖకు సరెండర్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే, మంగళవారమే ఆయన లాంగ్లీవ్లోకి వెళ్లిపోగా.. కొత్త డీఈఓ (ఎఫ్ఏసీ)గా డైట్ కాలేజీ ప్రినిపాల్కు కలెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
గతంలో సిరిసిల్ల జిల్లాలో ఎఫ్ఏసీ డీఈవోగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా.. వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో ‘రెండు సంసారాలు చేసేవాడికి బాధ ఏంటో తెలుస్తుంది. మీలో ఎవరైనా రెండు సంసారాలు చేస్తున్నారా?’ అంటూ చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. అయితే, చర్యలు తీసుకుంటారని ముందే ఊహించిన జనార్ధన్రావు, మంగళవారం ఉదయమే లాంగ్ లీవ్లో వెళ్లి, జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డికి చార్జ్ అప్పగించారు. ఈ చర్యలతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగి నప్పటికీ, జనార్ధన్రావు పద్ధతులపై చర్చ మాత్రం కొనసాగుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి విద్యాశాఖలో సమగ్ర సంస్క రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
లోతైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి :ముల్కల కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు
ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయాల్సిన డీఈవోనే అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరం. మొదటి నుంచీ డీఈవో అనుచిత ప్రవర్తన పాలనాపరమైన పొరపాట్లపై ఉన్నతాధికారులకు యుఎస్పిసి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయగా.. విచారణ నిర్వహించారు. ప్రస్తుత అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తిస్థాయి లోతైన విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.
కరీంనగర్ డీఈఓ జనార్ధన్రావుపై వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES