అనారోగ్యంతో మృతి
నవతెలంగాణ-కల్చరల్
ప్రఖ్యాత కథక్ నాట్యగురువు, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మంగళాభట్(62) కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రంగారెడ్డి జిల్లా హైటెక్సిటీలోని సింధు ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ సతీమణి మంగళాభట్. అలాగే, విఖ్యాత జానపద కళాబ్రహ్మ గోపాల్రాజ్ భట్ కోడలు. ఆకృతి కథక్ కళాకేంద్రం నెలకొల్పి 35 ఏండ్లుగా హైదరాబాద్లో ఎందరో శిష్యులను కథక్ నాట్యంలో తీర్చిదిద్దారు. ఆమె భర్త రాఘవరాజ్ భట్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్గా సేవలందిస్తున్నారు. మంగళాభట్ ఖవ్వాలి, గజల్స్కు కూడా కథక్ నృత్యాలు చేసి తన ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారం అందుకున్నారు. భర్తతో కలిసి దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి అక్కడి వారి ప్రశంసలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్.రాజశేఖరరెడ్డి ఆమెను ప్రతిష్టాత్మక ప్రతిభ, ఉగాది, కళారత్న పురస్కారాలతో సత్కరించారు. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ ఆవిర్భావ అవార్డుతో ఆమెను సన్మానించారు.
కళా ప్రేమికులు, బంధుమిత్రులు సందర్శనార్థం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11, మిథిలానగర్లో ఉన్న వారి గృహంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆమె మృతదేహాన్ని ఉంచనున్నారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. భారతీయ నృత్య కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మంగళాభట్ మృతి నాట్యరంగానికి తీరని లోటని సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు.
కథక్ నాట్య గురువు మంగళాభట్ ఇకలేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES