నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తనకు చదువు చెప్పిన గురువు జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ అధ్యాపకులు జైశెట్టి రమణయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. తనకు గురువుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రమణయ్య సిద్ధిపేటలో అధ్యాపకులుగా పనిచేస్తున్న సమయంలో తాను ఇంటర్ విద్యార్థిగా చదివానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 1971లో సిద్ధిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో చరిత్ర అధ్యాపకులుగా ఆయన పనిచేశారని వివరించారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఆయన అరుదైన వ్యక్తిగా ప్రసిద్ధి గాంచారని తెలిపారు. జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా పేరుపొందారని పేర్కొన్నారు. సౌత్ ఇండియా టెంపుల్స్ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించి ఆయన పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాను పొందారని వివరించారు.
రమణయ్య మరణం పట్ల కవిత సంతాపం
ప్రముఖ చరిత్రకారులు, విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
జైశెట్టి రమణయ్య మరణం పట్ల కేసీఆర్ సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



