ఉమ్మడి మెదక్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరిసగం మున్సిపాలిటీలు
హంగ్ ఏర్పడేచోట స్వతంత్ర అభ్యర్థులతో బేరసారాలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హౌరాహౌరీ పోరు సాగింది. 19 మున్సిపాలిటీలు ఉండగా చెరి సగం మున్సిపాలిటీలు స్వాదీనం చేసుకున్నాయి. 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్, 7 మున్పిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. 5 హంగ్ ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ దక్కించుకున్నది. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో మెదక్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి సరియైన మెజార్టీ లేకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు అధికారం చేపట్టే మాజిక్ ఫిగర్ లేకపోవడంతో తప్పని సరిగా బీజేపీ పార్టీ మద్దతు అవసరం ఏర్పడింది. రామాయంపేట మున్సిపాలిటీని కాంగ్రెస్, తూప్రాన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో అందోల్-జోగిపేట కాంగ్రెస్, గడ్డపోతారం బీఆర్ఎస్, గుమ్మడిదల బీఆర్ఎస్, ఇంద్రేశం బీఆర్ఎస్, కోహీర్ కాంగ్రెస్, నారాయణఖేడ్ కాంగ్రెస్, సదాశివపేట కాంగ్రెస్, సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ దక్కించుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో స్వతంత్రులు ఎటు వైపు మొగ్గుతే వారు చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిన్నారంలో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి మద్దతు ప్రకటిస్తే వారు చైర్మన్ అవుతారు. జహీరాబాద్లో బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కీలకం అయ్యారు. మెదక్ మున్సిపాలిటీలో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఎవరికి మద్దతు ఇస్తే వారే చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారు. నర్సాపూర్లోనూ అదే పరిస్థితి ఉంది. పీఠాలు దక్కించుకునేందుకు గెలిచిన కౌన్సిలర్లను క్యాంపులకు ఆయా పార్టీలు తరలించాయి. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. స్వతంత్రుల్లో చాలా మంది మద్దతు ఇవ్వాలంటే చైర్మన్ పీఠం తమకే ఇవ్వాలని పట్టుబడుతుండటంతో మున్సిపల్ రాజకీయం మరింత రంజుగా మారింది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించారు.


