నేడు కొచ్చిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్
కొచ్చి : క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన చికిత్స, పరిశోధన రంగంలో కేరళ మరో ముందడుగు వేసింది. ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మితమైన కొచ్చిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (సిసిఆర్సి)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 9న సోమవారం మధ్యాహ్నం 3.00గంటలకు కలమస్సేరిలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమానికి ఆరోగ్యమంత్రి వీణాజార్జ్, పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ హాజరవుతారని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిసిఆర్సితో అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స కేరళ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.449 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న సిసిఆర్సి కేరళలో క్యాన్సర్ సంరక్షణకు అదనపు కేంద్రంగా నిలవనుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో రెండు ప్రధాన క్యాన్సర్ సంరక్షణ సంస్థలైన తిరువనంతపురంలోని ఆర్సిసి, తలస్సేరిలోని ఎంసిసిలు సేవలను అందిస్తున్నాయి.
సిసిఆర్సి అధునాతన మరియు అధిక నాణ్యత గల క్యాన్సర్ సంరక్షణను అందిస్తుంది. ఇది కేరళ రాష్ట్రంలో అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధనల్లో మైలురాయిగా నిలవనుంది. కలమస్సేరి మెడికల్ కాలేజీ క్యాంపస్లో 12.63 ఎకరాల్లో సిసిఆర్సిని అభివృద్ధి చేసినట్టు అధికారులు తెలిపారు. 12 ఆపరేషన్ థియేటర్లతో పాటు భవిష్యత్ రోబోటిక్ సర్జికల్ విధానాల కోసం ప్రత్యేకంగా మరో ఆపరేషన్ థియేటర్ను నిర్మించామని అన్నారు. సీసీఆర్సీ క్యాన్సర్ పరిశోధనలకు కూడా ప్రాధాన్యత నివ్వనుందని, స్కానింగ్, ఎక్స్రే, రేడియేషన్ థెరపి మరియు ఇతర కీలక సేవలను ఎఐ సాంకేతికతతో అనుసంధానించబడినట్టు చెప్పారు. అలాగే ఈడీజీఈ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి ఆస్పత్రి ఇదే కానుందని అన్నారు. సీసీఆర్సీకి సౌరశక్తితో విద్యుత్ను అందిస్తుం డటంతో, 25శాతం కర్బన ఉద్గారాల విడుదలతో పర్యావరణ హితంగా నిలవనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా 2050 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను జీరో స్థాయికి చేరాల్చలని భావిస్తున్నట్టు తెలిపారు.



