నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీలో ఫీజు రీయింబర్స్మెంట్పై విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హత ఉండదని ఉపకులపతుల భేటీలో నిర్ణయించారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ యూనివర్సిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ, అవి అమలు కావడం లేదని ఉపకులపతులు ప్రస్తావించారు.
ఈసారి తప్పకుండా హాజరును ఫీజు రీయింబర్స్మెంట్కు ముడిపెట్టి ఆ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో కొంతమేర విద్యానాణ్యత పెరుగుతుందని వీసీలు అభిప్రాయపడ్డారు. ఇక, ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు.