నవతెలంగాణ-హైదరాబాద్: భారత్, అమెరికాల మధ్య పదేండ్ల రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది ఒక సంకేతంగా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు. మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌలాలంపూర్లో రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు.
10ఏళ్ల అమెరికా -భారత్ ప్రధాన రక్షణ భాగస్వామ్యం కోసం ముసాయిదాపై సంతకం చేశామని, ఇది ఇప్పటికే బలమైన మా రక్షణ భాగస్వామ్యంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమావేశం అనంతరం రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా రక్షణ సంబంధాలన్నింటిలోనూ విధాన దిశానిర్దేశం చేస్తుందని రక్షణ మంత్రి అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ మూల స్తంభంగా ఉందని, స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన మరియు నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్థారించడంలో తమ భాగస్వామ్యం చాలా కీలకమని అన్నారు.
ఈ ఒప్పందం రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతుందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థిరత్వం, నిరోధానికి ఒక మూలస్తంభం అని అన్నారు. సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక సహకారాన్ని పెంచుకుంటున్నామని అన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని అన్నారు.

 
                                    