భూభారతితో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పటాన్చెరులో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయ భవనానికి శంకుస్థాపన
నవతెలంగాణ-పటాన్చెరు
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల కాంప్లెక్స్కు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామని చెప్పారు.
మొదటి విడతగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కర్దనూర్లో శంకుస్థాపన చేశామని, దీనికి సుమారు మూడెకరాల స్థలం కేటాయించి, 20వేల ఎస్ఎఫ్టీలో నిర్మిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రయివేట్ భాగస్వామ్య విధానంలో రాజ్ పుష్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్రెస్ ప్రయివేట్ లిమిటెడ్కు నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. ఆరు నెలల్లో అధునాతన హంగులతో భవన నిర్మాణం పూర్తి చేయాలని సూచించినట్టు చెప్పారు. అలాగే, కనీసం ఐదేండ్లపాటు ఆయా భవనాల నిర్వహణ బాధ్యత కూడా నిర్మాణ సంస్థలదే ఉండేలా నిబంధనలు పొందుపరిచామని మంత్రి స్పష్టం చేశారు. సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో కొత్తగా వివాహాల రిజిస్ట్రేషన్కు వచ్చే జంటలకు, చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు, దివ్యాంగులు, వయోవృద్ధులు, పేద ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.
భవిష్యత్లో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టే, భూమికి భూధార్ మ్యాప్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. భూభారతి ద్వారా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒకే ప్లాట్ఫారంలో భూమి వివరాలు, సరి హద్దులు, నిషేధిత సర్వే నెంబర్ల వివరాలు లభించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్టు చెప్పారు. కొత్త యాప్ ద్వారా డబుల్, ట్రిపుల్ డాక్యు మెంట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల ను నివారించొచ్చన్నారు. అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేయిస్తున్నామని, అందుకు 5500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్ల ను నియమించామని, ఆధునిక పరికరాలు కొనుగోలు చేశామని అన్నారు. భూ సమస్యలు తగ్గితే జాతీయ, అంతర్జాతీయ పెట్టు బడులు రాష్ట్రానికి మరింతగా వస్తాయని తెలిపారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రానికి పటాన్చెరు పారిశ్రామిక హబ్గా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభి స్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్లు అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్ రాజీవగాంధీ హనుమంతు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.14,500 కోట్ల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పని చేస్తున్నాయని, ఓఆర్ఆర్ పరిధి వెలుపల ఉన్న కార్యాలయాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి సమీకృత భవనాలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఫయీమ్, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్టార్లు, ఆర్డీఓ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి, రాజ పుష్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



