Friday, June 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగుడిసెల జోలికొస్తే ఖబడ్దార్‌

గుడిసెల జోలికొస్తే ఖబడ్దార్‌

- Advertisement -

రెవెన్యూ, పోలీస్‌ అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా
జనగామ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన..
లోపలికి వెళ్లే యత్నం
పోలీసులు, గుడిసెవాసులకు మధ్య తోపులాట
సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్‌, విడుదల
నవతెలంగాణ-జనగామ

గుడిసెల జోలికి వస్తే ఖబడ్దార్‌.. అంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసె వాసులు కదం తొక్కారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్‌ గూడెం గ్రామ శివారు పరిధిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న నిరుపేదల పట్ల స్థానిక తహసీల్దార్‌, ఎస్‌ఐ, రెవెన్యూ, పోలీస్‌ అధికారుల వేధింపులకు నిరసనగా మంగళవారం జనగామ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. నాలుగు గంటలపాటు ఎర్రటి ఎండలో కూర్చున్నా కలెక్టర్‌ స్పందించక పోవడం తో.. ఆయన తీరుకు నిరసనగా కలెక్టరేట్‌ ప్రధాన గేట్లను తోసుకుంటూ సీపీఐ(ఎం) నాయకులు, గుడిసె వాసులు లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, గుడిసె వాసులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అరెస్టు చేసి వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కార్యా లయం అడ్మినిస్ట్రేషన్‌ అధికారి మన్సూరి ఆందోళనకారుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. గుడిసెవాసుల ఆవేదన విని కలెక్టర్‌తో మాట్లాడి ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. పటేల్‌ గూడెం గ్రామ శివారులో నాలుగేండ్ల క్రితం తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో వర్షా కాలం సమీపించడంతో ఈదురు గాలులతో చెల్లాచెదురైౖన గుడిసె లను సరిచేసుకుంటున్నవారి వద్దకు సంబంధిత తహసీల్దార్‌, ఎస్‌ఐ వచ్చి తీవ్ర పదజాలంతో దూషించడం దారుణమన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన అధికారులు భూ అక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. అందుకు నిరసనగా కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తుంటే జిల్లా కలెక్టర్‌ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్‌ ప్రజలకు సమయం ఇవ్వకుండా కుర్చీకే పరిమితమై పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కలెక్టర్‌ భూ కబ్జాకోర్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనేకసార్లు పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇచ్చేంతవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేయడం సరైన చర్య కాదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి తహసీల్దార్‌, ఎస్‌ఐ, సీఐపై చర్యలు తీసుకోవాలని, గుడిసెవాసులపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. గుడిసెవాసుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సింగారపు రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్‌, జోగు ప్రకాశ్‌, పొత్కనూరి ఉపేందర్‌, లింగాల గణపురం, దేవరుప్పుల మండలాల కార్యదర్శులు బొడ్డు కర్ణాకర్‌, ఇంటి వెంకటరెడ్డి, నాయకులు గోసంగి శంకరయ్య, తుటి దేవదానం, పల్లెర్ల లలిత, రవి కుమార్‌, యాకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -