ఖరీఫ్ కలిసివచ్చి తమ కష్టాలు గట్టెక్కాలనుకుంటూ పొలంబాట పట్టిన రైతులకు ఎప్పటిలాగా బాలారిష్టాలు తప్పడం లేదు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలకు కావాల్సింది ఏ కాలంలోనైనా పెట్టుబడి లేదా రుణం. అందులో ఎరువులు, విత్తనాలు ముఖ్యం. తగినంత విద్యుత్తూ అవసరమే. కానీ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకటించక, క్షేత్రస్థాయిలో అధికారుల సహకారం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గత సీజన్లో 1.29 ఎకరాల్లో సాగవ్వగా ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో సాగుచేయాలనేది లక్ష్యం. అయితే దానికి అదనంగా మరో ఐదు లక్షలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు సుమారు ఎనిమిదిరోజుల ముందే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే నారుపోస్తూ, దుక్కులు దున్నతూ రైతులు పొలాల్లో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ సమయంలో రైతులకు పెట్టుబడి డబ్బులు అత్యవసరం. అందుకే రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నా సర్కారుస్పందించడం లేదు. ఎకరాకు రూ.7500 చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని రూ.6వేలకు కుదించింది. ఇది కూడా గత యాసంగిలో ఇవ్వడం మరిచింది. 53.4లక్షల మంది 72 లక్షల ఎకరాలకుగాను రూ.4,366 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది. ఇంకా ఈసీజన్కు 70 లక్షల ఎకరాలకుగాను, రూ.7320 కోట్లు రైతు భరోసా కింద సాయం చేయాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా నాణ్యత లేని విత్తనాలు మార్కెట్లల్లో అమ్ముతుండటంతో ప్రతియేటా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిం టున్నాయి. ప్రత్యేకంగా విత్తనచట్టం లేకపోవడంతో అక్రమార్కుల ఆటలు యధేచ్చగా సాగుతున్నాయి. నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కొన్నిచోట్ల పట్టుకున్నప్పటికీ ఇది మరింత వేగమవ్వాలి. ఎందుకంటే, ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, కర్నాటక నుంచి దిగుమతి చేసుకున్నా నాసిరకం పత్తి విత్తనాలను బ్రాండెడ్ ప్యాకెట్లల్లో నింపి స్థానిక వ్యాపారుల ద్వారా రైతులకు అంటగడుతున్నారు. దీన్ని ఎంతమాత్రం ఊపేక్షించకూడదు. అలాగే అన్ని రకాల పంటల విత్తనాలు కలిపి రాష్ట్రానికి 20 లక్షల క్వింటాళ్లు అవసరమవ్వగా స్థానికంగా కొరత ఉన్నా, ప్రయివేటు కంపెనీలు మాత్రం అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుండటం గమనార్హం. ఉత్తర భారతానికి సైతం జొన్న, కూరగాయల విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. రాష్ట్రంలో 444 విత్తన కంపెనీలు, 467 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నప్పటికీ వాటిపై వ్యవసాయశాఖ పర్యవేక్షణ అంతకన్నా లేదు.
రాష్ట్రంలో సాగు, ఉత్పత్తులు ఏటేటా పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మేరకు విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధమవుతున్నా రైతుల అవసరాలను నెరవేర్చలేక పోతున్నది. సన్నధాన్యానికి బోనస్ దృష్ట్యా 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే పరిస్థితులున్నట్టు తెలుస్తోంది. ఇందుకు 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవగా 60.11 లక్షల ఎకరాల్లో సన్నాలు, 38.21 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి 98.32 లక్షల ఎకరాలకు విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసినట్టుగా సమాచారం. కానీ, రైతులకు అవి ఎక్కడా అందుబాటులో లేకపోవడం విచిత్రం. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం అంగీకరించినా ఒక్క అడుగూ ముందుకుపడలేదు. అలాగే సర్కారు బడ్జెట్ ప్రకారం 2024- 25లో 35.25 లక్షల మంది రైతులకు రూ.90,792 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, రూ.60,713 కోట్లు(66.37 శాతం) మాత్రమే ఇచ్చింది. మొత్తం 72 లక్షల మందికి కమతాలుంటే, బ్యాంకులు కేవలం 45 లక్షల మందికి మాత్రమే రుణాలు అందజేశాయి. కౌలు రైతులకు పూర్తి ఎగనామంపెట్టాయి. ఈ విధానాన్ని సమీక్షించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం భూమి మేరకు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా అది వాస్తవ రూపం దాల్చడం లేదు.
గ్రామీణ, సెమీఅర్భన్ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.14 వేలలోపే. అందులోనూ పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం ద్వారా వచ్చేదే ఎక్కువ. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు ఏడాదికేడాది తడిసిమోపెడవుతున్నాయి. చీడపీడలు, ప్రకృతి వైఫరీత్యాలు కోరలు చాస్తున్నాయి. పంటలు విరగపండినా ధరలు పాతాళానికి జారిపోతున్నాయి. రాబడి తగ్గి, రుణభారం పెరిగి రైతులెందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి బడుగు రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే స్వామినాథన్ సిఫారసు చేసినట్టుగా భూమి విలువతోపాటు అన్నీ రకాల ఖర్చులనూ లెక్కించి ఆ మొత్తానికి యాభై శాతం అదనంగా కలిపి పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి. శాస్త్రీయ పంటల ప్రణాళికకు, వ్యవస్థాగత రుణ సదుపాయాలు, కోల్డ్స్టోరేజీలు, సకాలంలో పరిహారాల పంపిణీలో ప్రభుత్వాలు అండగా నిలిస్తేనే అన్నదాతలను ఆదుకున్నట్టు, లేదంటే ఎప్పటిలాగే రైతులు మోసపోయినట్టే!
ఖరీఫ్ కష్టాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES