– ‘గుజరాత్ సమాచార్’పై మారిన పాలకుల వైఖరి
– విమర్శనాత్మక కథనాలే కారణం
– కన్నెర్ర చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు
– దాడులు.. అరెస్టులు.. ప్రకటనల నిలిపివేత
‘గుజరాత్ సమాచార్’…ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చి ఆయనకు బాసటగా నిలిచిన పత్రిక. కానీ ఇప్పుడది కేంద్ర దర్యాప్తు సంస్థల ఆగ్రహానికి గురవుతోంది. పత్రికపై దాడులు, అరెస్టులు జరిగిపోతున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు నిషేధిస్తూ దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణమేమిటో తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాల్సిందే.
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ప్రతిష్ట మసకబారింది. అప్పుడాయన ప్రముఖ గుజరాతీ పత్రికకు ఓ లేఖ రాశారు. గుజరాత్లో చెలరేగిన హింసపై వాస్తవాలు ప్రజలకు వివరించినందుకు ఆ పత్రికను అందులో ఆయన ప్రశంసించారు. అయితే అప్పుడు ఆ పత్రికలో వచ్చిన కథనాలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. మీడియా పాటించాల్సిన విలువలను ఆ పత్రిక ఉల్లంఘించిందని విమర్శించింది. ఆ పత్రికే గుజరాత్ సమాచార్.
దాడులు…అరెస్టులు
ఆ మరుసటి సంవత్సరమే మోడీ గుజరాత్ రాష్ట్రంలో ‘వికసిత్ భారత్’ సదస్సును నిర్వహించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీని వెనకేసుకొచ్చిన గుజరాత్ సమాచార్ పత్రికే వికసిత్ భారత్ సదస్సు విఫలమైందని విమర్శించింది. అది అక్కడితో ఆగలేదు. భారత ఉపరాష్ట్రపతి కాన్వారులో కంటే ముఖ్యమంత్రి కాన్వారులోనే ఎక్కువ కార్లు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. ఇక చెప్పేదేముంది? ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పత్రికకు ప్రభుత్వ ప్రకటనలు నిలిచిపోయాయి. దీనిపై అది న్యాయ పోరాటం చేసింది. ఇటీవల ఆ పత్రికకు చెందిన అనేక కార్యాలయాలపై అధికారులు జరిపిన దాడులను గుజరాత్లోని పలువురు పాత్రికేయులు ప్రస్తావిస్తూ నాటి వైరమే నేటి ఈ చర్యలకు కారణమని విమర్శించారు. ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పత్రిక కార్యాలయాలలో తనిఖీలు చేపట్టి సహ యజమాని అయిన బాహుబలి శాంతిలాల్ షాను అరెస్ట్ చేశారు. ఇది తమను లక్ష్యంగా చేసుకొని జరిపిన చర్యేనని షా సోదరుడు, పత్రికకు చెందిన మరో సహ యజమాని శ్రేయాన్ష్ శాంతిలాల్ షా మండిపడ్డారు. ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్ ఆరోపణల కారణంగానే పత్రిక కార్యాలయాలపై దాడులు జరిగాయని అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. ఐపీఓ నిధుల దుర్వినియోగానికి సంబంధించి 2016లో నమోదైన కేసులో ఈడీ విచారణ జరుగుతోందని తెలిపాయి. అయితే అటు ఈడీ కానీ, ఇటు ఆదాయపన్ను శాఖ అధికారులు కానీ దాడులకు అసలైన కారణాలను బయటపెట్టలేదు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో పోటీ పత్రిక
గుజరాత్ సమాచార్ దాదాపు ఓ శతాబ్డం క్రితం మొదలైన పురాతన పత్రిక. అది జీఎస్టీవీ అనే వార్తా ఛానల్ను కూడా నిర్వహిస్తోంది. పత్రికను లోక్ ప్రకాశన్ లిమిటెడ్ ప్రచురిస్తోంది. 2017లో దీని రీడర్షిప్ 117.8 లక్షలు. 2019లో అది తగ్గినప్పటికీ దేశంలో అత్యధిక పాఠకులు చదివే గుజరాత్ పత్రికగానే నేటికీ కొనసాగుతోంది. 2003 అక్టోబర్ 15వ తేదీన నాలుగు పేజీల ఓ పత్రిక వెలువడింది. దాని పేరు గుజరాత్ సత్య సమాచార్. ఆ పత్రిక అచ్చు గుజరాత్ సమాచార్ లాగానే కన్పించింది. మాస్ట్హెడ్ నుండి ఫాంట్ వరకూ సేమ్ టూ సేమ్. ఆ రోజు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ప్రచురితమైన ఓ వార్త ప్రకారం…గుజరాత్ సత్య సమాచార్ను రాష్ట్ర సమాచార శాఖ ముద్రించింది. పన్నెండు లక్షల కాపీలను ముద్రించి, వాటిని విధిగా పంపిణీ చేయాలంటూ ఏజెంట్లపై ఒత్తిడి తెచ్చారు. పత్రిక సంపాదకుడిగా సమాచార శాఖ డైరెక్టరే వ్యవహరిస్తున్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి మోడీయే చెప్పారు.
వ్యక్తులు కాదు… అంశాలే ముఖ్యం
గడచిన సంవత్సరంన్నర కాలంగా జీఎస్టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమాలకు బీజేపీ నుండి ప్రతినిధులు ఎవరూ హాజరు కావడం లేదు. అసలు ఆ ఛానల్ నిర్వహించే ఏ కార్యక్రమానికీ బీజేపీ తన ప్రతినిధులను పంపడం లేదు. చర్చా వేదికపై ఛానల్ యాజమాన్యం ఓ కుర్చీని ఖాళీగా ఉంచుతోంది. ‘ఇది బీజేపీ ప్రతినిధికి చెందిన ఖాళీ కుర్చీ’ అనే లేబుల్ దానిపై కన్పిస్తుంది. తనకు వత్తాసు పలకాలని ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకు తాము అంగీకరించకపోవడంతో దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వేధిస్తోందని శ్రేయాన్ష్ షా విమర్శించారు. గుజరాత్ సమాచార్కు మతం అంటూ ఏదీ లేదని, పత్రికలో ప్రచురించే వార్తలు, కథనాలు అంశాలపై ఆధారపడి ఉంటాయి కానీ వ్యక్తులపై కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వమే కాదు…గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పత్రికకు ప్రకటనలు నిషేధించిందని గుర్తు చేశారు. దీనిపై తాము రెండుసార్లు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. కోర్టు ఆదేశాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టినా ఇప్పుడు మళ్లీ ఆపేసిందని తెలిపారు. ‘వారు మా నుండి ప్రశంసలు కోరుకుంటారు. నాకు మోడీ పట్ల ద్వేషమేమీ లేదు. 2014లో ఆయన మమ్మల్ని కొనియాడారు’ అని అన్నారు.
నిశిత విమర్శలతో సంపాదకీయాలు…కథనాలు
గుజరాత్ సమాచార్ పత్రిక తన సంపాదకీయాలలో ప్రభుత్వ వైఖరులను నిశితంగా విమర్శిస్తోంది. దేశ భద్రత విషయంలో మోడీ వ్యవహరించిన తీరును, పహల్గాం దాడి తర్వాత బాధితులను ఆయన పరామర్శించకపోవడాన్ని, పాక్ మిత్రదేశమైన టర్కీతో గుజరాత్ ప్రభుత్వం వ్యాపార సంబంధాలను కొనసాగించడాన్ని ఆ పత్రిక తప్పుపట్టింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణను ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించగా ఆ పత్రిక మాత్రం ‘ప్రజలు సమాధానాలు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు కాల్పుల విమరణ ఎందుకు?’ అని ప్రశ్నించింది. ‘పహల్గాం దాడి తర్వాత మోడీ విదేశీ పర్యటనను ముగించుకొని హుటాహుటిన ఢిల్లీకి చేరినప్పటికీ పెద్దగా కార్యాచరణ చేపట్టలేదు. మరునాడే ఆయన బీహార్ వెళ్లి ఓ ర్యాలీలో ప్రసంగించారు. పహల్గాం దాడి గురించి మాట్లాడారే తప్ప అక్కడికి వెళ్లలేదు.బాధిత కుటుంబాలను పరామర్శించలేదు’ అని వేలెత్తి చూపింది. పాకిస్తాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని పత్రిక తప్పు పట్టింది. 1971లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ను రెండు భాగాలుగా విడగొట్టారని, మోడీ ఇప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిషేధానికి గురైన అనేక మీడియా ఛానల్స్ ఎక్స్ హ్యాండిల్స్లో గుజరాత్ సమాచార్ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన బృందాలలో ఒక దానిలో విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాత్రికేయుడు ఎంజే అక్బర్ సభ్యుడుగా ఉన్నారు. ఆయనను ప్రతినిధి బృందంలో చేర్చడంపై మహిళా పాత్రికేయులు విమర్శలు కురిపించారు. దీనిపై ఈ నెల 19న గుజరాత్ సమాచార్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ‘అక్బర్ తిరిగి మోడీ టీమ్లో చేరారు. మీటూ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఏడు సంవత్సరాల క్రితం మంత్రి పదవిని వదులు కోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న టర్కీ కంపెనీలపై దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు నిషేధం విధిస్తే గుజరాత్లో మాత్రం అవి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని ధ్వజమెత్తింది. ఇందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపింది.
గుజరాత్లో గత ఐదు సంవత్సరాల కాలంలో 70 వేల మంది శిశువులు ఎలా మరణించారో వివరిస్తూ ఈ నెల 19న గుజరాత్ సమాచార్ ఓ కథనాన్ని అందించింది. మరోవైపు రాష్ట్రంలో నీటి ఎద్దడి, రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై జీఎస్టీవీ నివేదికలు అందిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో వివరిస్తూ వార్తలు ఇచ్చింది. పత్రిక ఎప్పుడూ విమర్శలు చేస్తుంటుందని, కానీ ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా చెప్పాలి కదా అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జైరాజ్ సింగ్ పర్మన్ ముక్తాయింపు ఇచ్చారు.
నాటి నుండి అదే వైఖరి
ప్రభుత్వానికి, గుజరాత్ సమాచార్కు మధ్య సయోధ్య కుదర్చడానికి జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ పత్రిక ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, కథనాలతో ముందుకు సాగింది. వాస్తవానికి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు నుండే ఆ పత్రిక అదే వైఖరితో ఉంది. 1985లో గుజరాత్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జోరుగా నడిచింది. దాని ఫలితంగా మత హింస చెలరేగింది. పత్రిక కార్యాలయాన్ని కూడా తగలబెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి మాధవ్ సింగ్ సోలంకి, ఇతర కాంగ్రెస్ నాయకులపై పత్రిక విమర్శలు చేసింది. అగ్నిప్రమాదం జరగడానికి అదే కారణం అయి ఉండవచ్చునని కూడా వాదనలు వినవచ్చాయి. ప్రమాదం కారణంగా పత్రిక ప్రచురణ వారం పాటు నిలిచిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో తగ్గే ప్రసక్తే లేదని శ్రేయాన్ష్ షా తన సంపాదకీయంలో స్పష్టం చేశారు. ఆ తర్వాతి కాలంలో పత్రికకు, బీజేపీ ప్రభుత్వానికి మధ్య అనేక సంవత్సరాల పాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఇదంతా గత చరిత్ర.
నాడు ముద్దు.. నేడు వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES