Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేటినుంచి పతంగుల పండుగ

నేటినుంచి పతంగుల పండుగ

- Advertisement -

– పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రారంభించనున్న మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మంగళవారం నుంచి హైదరాబాద్‌లో పతంగుల పండుగ ప్రారంభంకానుంది. ఇందుకోసం సర్వంసిద్ధమైంది. కైట్‌, అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పతంగుల పండుగను ప్రారంభిస్తారు. హాట్‌ఎయిర్‌ బెలూన్‌ అండ్‌ డ్రోన్‌ ఫెస్టివల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పరేడ్‌గ్రౌండ్స్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌, గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్‌ షో నిర్వహిస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈనెల 15 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉంటాయి. ఈ ఫెస్టివల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్‌ ఫ్లయర్స్‌, అదేవిధంగా భారత్‌లోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్‌ కైట్‌ ఫ్లయర్స్‌ పాల్గొననున్నారు. సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిమాణంలోఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేస్తారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పలు రకాల స్వీట్లను పుడ్‌ కోర్టులోని 60 స్టాళ్లలో ప్రదర్శించి, విక్రయిస్తారు. చేనేత, హస్తకళలకు వంద స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూరుస్తాయి. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలనీ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -