జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రోడ్ షోలు, ప్రచార వ్యూహాలపై, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.. జూబ్లీహిల్స్లో ప్రచారం ఎలా చేస్తున్నారు.. ఓటర్ల నాడీ ఎలా ఉంది అని కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ప్రచారం, 40 మంది బీఆర్ఎస్ స్టార్ కంపైనర్ల ప్రచార తీరుపై చర్చ సాగినట్టు తెలిసింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేయాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. దీనికితోడు జూబ్లీహిల్స్ ఇన్చార్జిలతో ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారన్న చర్చ కూడా జరుగుతోంది.