మన భారతదేశం రెండు ఆర్థిక ప్రపంచాల్లో జీవిస్తుంది. ఒకటి నిత్య సత్యమైన బీదరికపు ఆకలి ప్రపంచం. రెండు విచక్షణా రహిత వికృత దోపిడీ కుబేర ప్రపంచం. ఉత్తర దక్షణ ధృవాల్లాంటి ఈ ప్రపంచాలు పాలకుల దోపిడీ విధానాల వల్ల నానాటికీ విస్తృతమవుతూ పూడ్చలేని అగాధాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఓ సీ బేసిన్లో (సముద్ర తీరం) క్వాలిటీ ఆయిల్ కోసం ఓ బిలియనీర్ చాలా ఖర్చుపెట్టి ప్రయోగాలు చేయిస్తుంటాడు. ఎట్టకేలకు సైంటిస్టులు ఆ హైక్వాలిటీ నేచురల్ గ్యాస్ ఆయిల్ను కనిపెడతారు. ఆ విషయం మీడియా ద్వారా బయటకు పొక్కకుండా ఉండేందుకు చాలా నిర్దాక్షిణ్యంగా ఆ ల్యాబ్లో పనిచేసేవారిని సైంటిస్టులతో సహా చంపేయిస్తాడు.
ఆ రాత్రివేళ కేంద్రమంత్రి వద్దకు పోయి, ఈ విషయం చెప్పి రహస్యంగా డీల్ కుదుర్చుకుంటాడు. ఆ ఆయిల్ దొరికే సముద్ర తీరాన్ని ప్రైవేటుగా తాను కైంకర్యం చేసుకోవడం, తత్ఫలితంగా లక్ష కోట్లు పార్టీ ఫండ్ మంత్రి చెప్పిన వారికి ఇచ్చేలా ఒప్పందం కుదురుతుంది.
మరి లక్షకోట్లు ఒకేసారి వారి ఖాతాలకు చేరితే ప్రమాదం అని సగం హవాలాగానూ (విదేశాలకు బ్లాక్ మనీగా వెళ్లి స్వదేశానికి వైట్ మనీగా తిరిగి రావడం) మరో సగం నమ్మకస్థులైన బినామీ వ్యక్తులకు చేరితేనే కథ సుఖాంతం అవుతుందని, ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్గా వున్న ఓ సి.బి.ఐ. ఆఫీసర్ చెప్తాడు. నిజాయితీగా పనిచేసే ఆ సి.బి.ఐ. ఆఫీసర్ పాలక పార్టీల చదరంగంలో నేరస్థుడిగా ముద్రపడి జైలుశిక్ష అనుభవిస్తాడు.
ఈ బిలియనీర్ తన పలుకుబడితో ఆ ఆఫీసర్ను జైలు నుండి తప్పించి తనకు అనుకూలంగా వాడుకుంటాడు. ఆ ఆఫీసర్కు తన భార్యపై, కూతురిపై వున్న అమిత ప్రేమతో ఈ అక్రమానికి ఒడిగడతాడు.
నమ్మకస్తులైన బినామీ వ్యక్తులు ఎవరంటే ఏ బాదరబందీ లేని బిచ్చగాళ్లని చెప్తాడు ఆఫీసర్. నలుగురు బిచ్చగాళ్లను బిలియనీర్ తన మనుషులతో తిరుపతి నుండి తెప్పిస్తాడు. ఆధార్కార్డులు, సెల్ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలు వారిపేరు మీద సృష్టించి ఆ ఖాతాల్లోకి కోట్లు కోట్లు జమయ్యేలా చూస్తారు. ఖాతాల్లోకి డబ్బు రాగానే మళ్లీ ఈ విషయం బయటకు పొక్కకుండా వెనువెంటనే ఆ బిచ్చగాళ్లని ఈ బిలియనీర్ మనుషులు చంపేస్తుంటారు. అలా ఇద్దర్ని చంపేస్తారు.
మానవత్వం గల ఆఫీసర్కు ఇది నచ్చదు. తనలో తీవ్ర ఘర్షణ మొదలవుతుంది. తన స్వార్థం కోసం ఇతరుల ప్రాణాలు బలికొనేందుకు తాను సాయపడకూడదనే నిర్ణయానికి వస్తాడు. ఇదే కథలో టర్నింగ్ పాయింట్. మిగిలిన ఇద్దర్ని రక్షించే క్రమంలో తన ప్రాణాల్ని పోగొట్టుకుంటాడు. సి.బి.ఐ. ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తే, ఓ బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటించాడు. మోసపూరితమైన ప్రేమలో విఫలమై పరిస్థితుల ప్రభావంతో నిరంతరం ధనుష్కు (బిచ్చగాడు) దగ్గరయ్యే పాత్రలో రష్మిక నటించింది.
ఇలా ముగ్గురికి మూడు విభిన్న పాత్రలు. విభిన్న కథాంశంతో వచ్చిన ‘కుబేర’ చిత్రం దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పినట్టు ప్రేక్షకులకు నవ్యానుభూతిని కలిగిస్తుంది.
బిచ్చగాళ్ల జీవితం భరించలేని దుర్గంధపూరిత పరిసరాల మధ్యన సాగుతుంటుంది. చెత్తాచెదారం మురికి వాసనతో కంపుకొడుతుంది. ఈ చేదు వాస్తవం భద్రజీవులకు త్వరగా జీర్ణంకాదు.
కనుకనే ‘కుబేర’ ను ఒక కంపుకొట్టే చిత్రంగా భావించేవాళ్లు కూడా వున్నారు. సినిమా చూసి వచ్చి వెంటనే స్నానం చేశామని కూడా చెప్తున్నారు.
మరి కోట్లాదిమంది భారత ప్రజానీకం నేటికీ ఇలా మురికివాడల్లో జీవించడం, చెత్తాచెదారం శుభ్రం చేసే పారిశుద్య కార్మికులుగా, సఫాయిపనివారిగా బతకడం అందరికీ తెలిసిందే. ఆ అధోజగత్ సహోదరుల్లో భాగమే మన బిచ్చగాళ్లు (భారతీయులు).
”మనదీ ఓ బతుకేనా.. కుక్కలవలె నక్కలవలె సందులలో తిరిగే పందులవలె” అని ప్రశ్నిస్తే.. ‘బతకడం కోసమే బతుకు అని, అది ఎంత హీనమైనా.. జీవితం పట్ల విరక్తికాదు. పెంచుకోవాల్సింది అనురక్తి’ అని ధనుష్ బిచ్చగాడి పాత్ర ద్వారా అన్యాపదేశంగా జవాబు ఇస్తాడు.
దేశం ఏదైనా – అమెరికాలో ట్రంప్ – ఎలాన్ మస్క్, ఇండియాలో మోడీ – అదానీ ల సంబంధ భాందవ్యం ఆర్థిక సంబంధమే. పొలిటికల్ లీడర్స్ (రాజకీయ నేతలు) బిలియనీర్లు (కుబేరులు) మధ్య గల లోపాయికర విధానాల వలన ఆర్థిక అంతరాలు పెరగడమే కాదు, నేపద్యంలో జరిగే దుర్మార్గాలను ఈ సినిమా సూక్ష్మంగా చూపెడుతుంది.
– కె.శాంతారావు, 9959745723