నవతెలంగాణ-హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన వి. కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం కేసులో.. రెండో నిందితుడిగా ఉన్న వి.కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్కుమార్ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను జెఎఫ్సిఎం స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్కు పంపాలని ఆదేశించింది. గత నెల అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న స్లీపర్ బస్సు ఒక బైక్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుపోయి, 19 మంది సజీవదహనమై ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో సేఫ్టీ ఎగ్జిట్ డోర్లు లేవు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవడం, అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా వాహనం నడపడం వంటి నిర్లక్ష్యపు విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు, డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అరెస్టయి రిమాండ్లో ఉన్నాడు.
యజమాని వినోద్కుమార్ మాత్రం వారాలుగా పరారీలో ఉండగా, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కర్నూలు పరిధిలోనే నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ట్రావెల్స్ యాజమాన్యం, రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా దృష్టి సారించారు. ఫిట్నెస్ లేకుండా బస్సు నడపడానికి అనుమతి ఎలా లభించింది ? ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



