తక్షణమే ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికులకు ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికులు దేశ వ్యాపితంగా సమ్మెలు చేస్తున్నా, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు లేకుండానే కేంద్రప్రభుత్వం ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించిందని విమర్శించారు. శనివారం నుంచే వాటి అమలుకు పూనుకున్నదని తెలిపారు. ఇది కార్మికుల హక్కులను కాలరాసే చర్య అని విమర్శించారు. ఆ కార్మిక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో కార్మికులు తమ రక్షణ కోసం సాధించుకున్న 29 పాత చట్టాలకు కేంద్రం తిలోదకాలివ్వటం తగదని హితవు పలికారు. నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికుల వేతనాలు, పని గంటలు, సామాజిక భద్రత వంటి హక్కులకు భంగం కలుగుతున్నదని పేర్కొన్నారు. కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారని తెలిపారు. కార్పొరేట్లకు అనుకూల విధానాలతో కార్మికుల హక్కులకు నష్టం కల్గించే కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఐక్య పోరాటాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.



