సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పరకాలలో కార్మికుల ర్యాలీ
నవతెలంగాణ – పరకాల : కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం పరకాల పట్టణంలోని దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు.
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలనీ,కాంట్రాక్ట్ కార్మికులను, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలన్నారు. అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనీ, ఇ.పి.ఎఫ్ పెన్షన్ కనీసం రూ.9 వేల రూపాయలు చెల్లించాలన్నారు. వ్యవసాయ కార్మికులతో సహా అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. గిగ్ వర్కర్లు, మత్స్యకారులు, గృహ కార్మికులు, అతిథి కార్మికులు, స్కీమ్ వర్కర్లు, పోర్టర్లు, దుకాణదారులు, మోటారు కార్మికులు, నిర్మాణ కార్మికులు, భద్రతా కార్మికులు, హౌస్ కీపింగ్ కార్మికులు మొదలైన వారికి వైద్య సహాయం, క్రమబద్ధమైన ఆదాయం, పెన్షన్ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఎన్నో సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించే కోసం కుట్ర చేస్తుందని లేబర్ కోడ్ లను అమలు చేయాలని చూస్తుందని, వాటిని వెంటనే రద్దు చేయాలని లేకుంటే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్, కార్మిక సంఘాల నాయకులు ఐ ఎన్ టి యు సి మున్సిపాలిటీ పరకాల పట్టణ అధ్యక్షులు బొచ్చు ఐలయ్య, ఉపాధ్యక్షులు మంద మహేష్ కార్యదర్శి పసుల సారయ్య, గుర్రం సరోజన, హమాలి సంఘం అధ్యక్షులు ఆదాం, బొచ్చు సంపత్, రమేష్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘ నాయకులు పోతిరెడ్డి సమ్మక్క, మేకల రాధ, జి. లింగా స్వామి, రాజయ్య డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరంజీవి, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ లు పాల్గొన్నారు.