– నవజాత శిశు కేంద్రంలో పనిచేయని వార్మార్లు
నవతెలంగాణ – అచ్చంపేట : అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు శ్వాస కోశ, తక్కువ బరువు, ఉబ్బసం పసిరికలు, ఊపిరితిత్తుల సమస్యలు,ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తించి వెంటనే శిశువులకు వైద్యం అందించడానికి పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఎస్ ఎన్ సి యు ( స్పెషల్ నియోనిటాల్ కేర్ యూనిట్ ) ను 2019లో ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలో చెంచుపెంటలు, గిరిజన తండాలు,ఏజెన్సీ పల్లెలు అధికంగా ఉన్నాయి. పట్టణానికి 60, 80 కిలోమీటర్ల దూరంలో పల్లెలు ఉన్నాయి. ఏ ఆరోగ్య ఆపద వచ్చిన పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి రావలసి ఉంటుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అవగాహన రూపంతో గర్భిణీ మహిళలు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారు. పుట్టిన శిశువులు అనారోగ్యంగా పుడుతున్నారు. శిష్యులకు వైద్యం అందించాలని ప్రధాన లక్ష్యంతో ఇక్కడ ఎస్ ఎన్ సి యు సెంటర్ ను ఏర్పాటు చేశారు.
నవజాత శిశువు కేంద్రం లో పరికరాలు లేకపోవడంతో పసిపిల్లలకు వైద్యం అందడం లేదు. గత నాలుగేళ్లుగా నిధులు మంజూరు చేయకపోవడంతో కేంద్రం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పసిపిల్లల ప్రాణాలకు భరోసా కరువైంది. ప్రతి నెలలో ఆసుపత్రిలో 50 ప్రసవాలు జరుగుతుంటాయి. అప్పుడే పుట్టిన శిశువులు బయట వాతావరణానికీ తట్టుకోలేకపోతుంటారు వైద్యం కోసం నవజాత శిశు కేంద్రానికి ప్రతిరోజు 30 మందికి పైగా శిశువులను తీసుకొస్తున్నారు.
పరికరాలు పనిచేయడం లేదు
నవజాత శిశు కేంద్రంలో శిశువుల వెచ్చదనం కోసం 20 ఫార్మర్లు ఉన్నాయి. కానీ రెండు మాత్రమే పనిచేస్తున్నాయని సిబ్బంది తెలిపారు. ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ రిపేర్ వచ్చాయి. పల్స్ మీటర్స్ పనిచేయడం లేదు. బబుల్ సిపాప్ యంత్రం ( శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు. ఈ యంత్రం ద్వారా శ్వాసను అందిస్తారు కానీ ఈ యంత్రం ఇక్కడ లేదు.,) ఊపిరితిత్తులకు చికిత్స అందించే వెంటిలేటర్ సౌకర్యం కూడా లేదు.
ఎస్ ఎన్ సి యు విభాగంలో సరిపోను వైద్యులను, సిబ్బందిని నియమించాలని పరికరాలు పని చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఎన్ హెచ్ ఎం ( జాతీయ ఆరోగ్య మిషన్ ) ద్వారా ప్రారంభంలో కొన్నాళ్లు సంవత్సరానికి 10 లక్షలు మంజూరు చేసేవారు కానీ గత నాలుగేళ్లుగా నిధులు రావడం లేదు.అత్యవసరమైన మందులు, శిశువులకు తొడిగే డైపర్లు ఉచితంగా సరఫరా చేసేవారు కానీ నిధులు లేకపోవడంతో కుటుంబీకులు బయట కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రిలోని ఎస్ ఎన్ సి యు విభాగంలో అన్ని పరికరాలు పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నల్లమల ప్రజలు కోరుతున్నారు.
నాలుగేళ్లుగా నిధులు రావడం లేదు: చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ప్రశాంత్
ఎస్ ఎన్ సి యు విభాగంలో శిశువులకు వెచ్చదనాన్ని ఇచ్చే వార్మర్లు మరమ్మతులకు వచ్చాయి. కేంద్రం నుంచి గత నాలుగేళ్ల నిధులు రావడం లేదు. వైద్యం కోసం శిశువులు అధిక సంఖ్యలో వస్తున్నారు . పరికరాలు లేకపోవడంతో శిష్యులకు సక్రమంగా వైద్యం అందడం లేదు. పల్స్ మీటర్లు కూడా పనిచేయడం లేదు.