న్యూఢిల్లీ : ఐఆర్సిటిసి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా మరో 11మందిపై మోపిన అభియోగాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారించనుంది. ఈ అభియోగాలను సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, ఆర్జెడి అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసు ఈ నెల 5న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారించనుంది. అక్టోబర్ 13న నిందితులపై మోసం, నేరపూరిత కుట్ర సహా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కోర్టు అభియోగాలు మోపింది. బీహార్లోనూ, దేశవ్యాప్తంగా బిజెపిని ప్రతిఘటిస్తుండటంతో లాలూ కుటుంబంపై కేంద్రం, కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమ కేసులు మోపి వేధిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.



